Viral Story : పొలంలో దాచిన రూ.5 లక్షలు.. చెదలు పట్టిన నోట్లు
Viral Story : రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్మును దొంగల బారిన పడకుండా, అనవసర ఖర్చులు కాకుండా కాపాడుకుందామనుకున్న ఒక రైతు తెలివితక్కువ
Viral-Video
Viral Story : రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్మును దొంగల బారిన పడకుండా, అనవసర ఖర్చులు కాకుండా కాపాడుకుందామనుకున్న ఒక రైతు తెలివితక్కువ ఆలోచన అతని కుటుంబానికి కోలుకోలేని కోలుకోలేని దెబ్బతీసింది. దొంగల భయంతో పొలంలో పాతిపెట్టిన ఐదు లక్షల రూపాయల నోట్లను ఏడాది తర్వాత తవ్వి చూడగా, వాటికి చెదలు పట్టి ముక్కలు ముక్కలుగా మారిపోయిన విస్తుపోయే ఘటన రాజస్థాన్లో వెలుగుచూసింది.
దొంగల భయం.. దాచిన పొలం
ఈ విచిత్రకర, శోచనీయ ఘటన రాజస్థాన్లోని బాలోత్రా జిల్లా నెవాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాంగీలాల్ మేఘ్వాల్ అనే రైతు ఏడాది క్రితం పచ్పద్ర ప్రాంతంలోని తన స్థలాన్ని విక్రయించగా ఐదు లక్షల రూపాయల నగదు వచ్చింది. తన సొంత పొలంలో పక్కా గదిని నిర్మించుకోవాలని అతను భావించాడు. అయితే ఆ డబ్బును ఇంట్లో ఉంచితే దొంగతనం జరుగుతుందేమోనని, లేదా మద్యం వ్యసనం, అనవసర ఖర్చుల వల్ల సొమ్ము కరిగిపోతుందని భయపడ్డాడు. దీంతో ఎవరికీ చెప్పకుండా ఆ ₹500 నోట్ల కట్టలను ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి, తన 10 బిగాల విస్తీర్ణం ఉన్న పొలంలో ఒకచోట గుంత తవ్వి పూడ్చిపెట్టాడు.
మతిమరుపు, ఆపై కుటుంబంతో కలసి వెతుకులాట
అయితే, మాంగీలాల్కు ఉన్న తాగుడు అలవాటు, మతిమరుపు కారణంగా ఆ డబ్బును పొలంలో ఏ నిర్దిష్ట స్థలంలో పాతిపెట్టాడో పూర్తిగా మర్చిపోయాడు. కొంతకాలం తర్వాత డబ్బు అవసరమై పొలానికి వెళ్లి వెతికినా ఆ ప్రదేశం గుర్తుకురాలేదు. చివరికి వేరే దారి లేక తన భార్యాపిల్లలకు ఈ విషయాన్ని చెప్పాడు. మొదట అతడి మాటలను కుటుంబ సభ్యులు నమ్మకపోయినా, నిజమేనని తేలడంతో అంతా కలిసి పొలంలోని పలు చోట్ల తవ్వకాలు జరిపారు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో ఆశలు వదులుకున్నారు.
వర్షం తెచ్చిన బయటపడిన సంచి.. ముక్కలైన నోట్లు
ఏడాది కాలం గడిచాక, ఇటీవల కురిసిన వర్షాలకు పొలాన్ని దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధం చేస్తుండగా ఒక రాత్రి ఆ ప్లాస్టిక్ సంచి నేలలోంచి పైకి తేలింది. మరుసటి రోజు ఉదయం పొలం చుట్టూ ఉన్న కంచెను సరిచేస్తున్న మాంగీలాల్ భార్య, కుమారుడు ఆ సంచిని గమనించారు. ఆతురతగా దానిని తెరిచి చూసిన వారికి తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు. సంచిలో రూ.500 నోట్ల కట్టలు ఉన్నప్పటికీ, ఏడాది పాటు భూమిలో ఉండటంతో చెదలు పట్టి ఆ నోట్లన్నీ చిన్న చిన్న ముక్కలుగా నలిగిపోయి ఉన్నాయి.
చేతులెత్తేసిన బ్యాంకులు.. మిగిలింది శోకమే
ఎంతో కొంత మొత్తం దక్కుతుందనే ఆశతో ఆ కుటుంబం చిరిగిపోయిన, పాడైపోయిన నోట్ల ముక్కలను ఏరుకుని పచ్పద్రలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను ఆశ్రయించింది. అయితే నోట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండటంతో బ్యాంకు అధికారులు వాటిని మార్చేందుకు నిరాకరించారు. ఆ తర్వాత బాలోత్రాలోని ఎస్బీఐ ప్రధాన శాఖకు వెళ్లినప్పటికీ అక్కడ కూడా వారికేమీ ఉపశమనం లభించలేదు. కష్టపడి సంపాదించిన ఐదు లక్షల రూపాయలు కళ్లముందే కాగితపు ముక్కలుగా మారిపోవడంతో ఆ రైతు కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.




