Road Collapse : ప్రెజర్ టెస్ట్కే రోడ్డు ఢమాల్.. వీడియో వైరల్.!
Road Collapse : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వింత ఘటన వెలుగుచూసింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ. 40 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఒక రహదారి, కొత్తగా వేసిన
Road Collapse
Road Collapse : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వింత ఘటన వెలుగుచూసింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ. 40 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఒక రహదారి, కొత్తగా వేసిన తాగునీటి పైప్లైన్ ప్రెజర్ టెస్టింగ్ (ఒత్తిడి పరీక్ష) సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దాదాపు మూడేళ్ల క్రితమే నిర్మించిన ఈ రోడ్డు ఒక్కసారిగా ధ్వంసం కావడంతో నిర్మాణ ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్కసారిగా విరిగిపడిన రోడ్డు.. భయంతో పరుగులు తీసిన జనం
ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వీడియోలో దృశ్యాల ప్రకారం.. పైప్లైన్ పరీక్ష జరుగుతుండగా రోడ్డు ఉపరితలం పెద్ద శబ్దంతో పగిలిపోయి, చీలికల నుంచి నీరు అత్యంత వేగంతో బయటకు ఉబికి వచ్చింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, బాటసారులు ప్రమాదాన్ని గమనించి భయంతో తక్షణమే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. కేవలం ప్రెజర్ టెస్ట్కే రోడ్డు ఇలా ధ్వంసమైతే, రాబోయే రోజుల్లో వర్షాలు, నిరంతర వాహనాల రాకపోకలను ఈ రహదారి ఎలా తట్టుకుంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రూ. 1,000 కోట్ల ప్రాజెక్టుల్లో నాణ్యతా లోపాలు?
ఈ ఘటనపై ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ కమిటీ హెడ్, కౌన్సిలర్ రాజేంద్ర రాథోడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన దాదాపు రూ. 1,000 కోట్ల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ఆయన ఆరోపించారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన కొన్ని ఏళ్లలోనే పలుమార్లు మరమ్మతులు చేయాల్సి రావడంపై గతంలోనే మేయర్, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లానని, కానీ కేవలం నోటీసులతోనే సరిపెట్టారని విమర్శించారు.
పిఎంఓ , ముఖ్యమంత్రికి లేఖ
రోడ్డు కుప్పకూలిన వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరుతూ రాజేంద్ర రాథోడ్ ప్రధానమంత్రి కార్యాలయం (PMO), కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ , రాష్ట్ర మంత్రి కైలాష్ విజయవర్గీయలకు లేఖలు రాశారు. ప్రస్తుతం ధ్వంసమైన రహదారిని బాగు చేయడం, సాంకేతిక లోపాలను అంచనా వేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఇంజనీరింగ్ లోపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




