Mystery Device : 'తాకొద్దు.. ప్రమాదం'.. గుజరాత్ తీరంలో లభ్యమైన మిస్టరీ డివైస్.!

Mystery Device : గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లా పరిధిలో గల సుత్రాపాడ (Sutrapada) సముద్ర తీరంలో ఒక వింత పరికరం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

G Krishna
Published on: 18 Jun 2026 2:01 PM IST
Mystery Device
X

Mystery Device 

Mystery Device : గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లా పరిధిలో గల సుత్రాపాడ (Sutrapada) సముద్ర తీరంలో ఒక వింత పరికరం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సముద్ర అలల తాకిడికి కొట్టుకువచ్చిన ఒక అపరిచిత వస్తువుపై ఇంగ్లీషులో "DANGER - DO NOT TOUCH" (ప్రమాదం - తాకవద్దు) అని రాసి ఉండటాన్ని గమనించిన తీరప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావించిన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేశారు. ప్రజలు చూపిన సమయస్ఫూర్తి వల్ల ఒక సంభావ్య ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. ముమ్మర దర్యాప్తు

తీరంలో ప్రమాదకరమైన వస్తువు ఉందనే సమాచారం అందిన వెంటనే పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు మొదట ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ప్రజలు ఎవరూ దానికి దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రహస్య పరికరం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలంగా ఈ తీరంలో పడి ఉంది, దీని వెనుక ఏవైనా ఇతర కారణాలు లేదా విద్రోహ చర్యలు దాగి ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆ పరికరం యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నారు.

ప్రాథమిక విచారణలో తేలింది ఇదే

పోలీసులు జరిపిన ప్రాథమిక పరిశోధనల ప్రకారం, ఆ వింత వస్తువు సముద్రంలో ప్రయాణించే పెద్ద పెద్ద నౌకలు , జహాజులలో ఉపయోగించే ఒక రకమైన 'స్మోక్ సిగ్నల్ డివైస్' (Smoke Signal Device) అయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి (Emergency) ఏర్పడినా, రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించాల్సి వచ్చినా నౌకల నుంచి దట్టమైన పొగను వెలువరించి తమ లొకేషన్‌ను తెలపడానికి ఇలాంటి స్మోక్ సిగ్నల్ పరికరాలను వాడుతుంటారు. అయితే సుత్రాపాడ తీరంలో దొరికిన ఈ పరికరం ఇంకా పని చేసే యాక్టివ్ స్థితిలో ఉందా లేదా అనేది నిర్ధారించాల్సి ఉంది.

సాంకేతిక పరీక్షలు.. అధికారుల హెచ్చరిక

భద్రతా ముందస్తు చర్యల్లో భాగంగా సంబంధిత సాంకేతిక విభాగాలు ఈ పరికరాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. అందులో ఏవైనా ప్రమాదకరమైన రసాయనలు లేక పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సాంకేతిక విచారణ పూర్తయిన తర్వాతే ఈ రహస్య పరికరానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో తీరప్రాంత ప్రజలకు , పర్యాటకులకు యంత్రాంగం ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. సముద్ర తీరాల్లో లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి అపరిచిత, హెచ్చరికలు రాసి ఉన్న వస్తువులు కనిపించినా వాటిని అస్సలు తాకవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story