Viral News: డాల్ఫిన్ వేట.. మత్స్యకారుడు అరెస్ట్.!

Viral News: బీహార్‌లోని సహర్సా జిల్లాలో పర్యావరణ ప్రేమికులను తీవ్రంగా కలచివేసే విచారకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

G Krishna
Published on: 26 Aug 2026 4:57 PM IST
Viral News
X

Viral News: డాల్ఫిన్ వేట.. మత్స్యకారుడు అరెస్ట్.!

Viral News: బీహార్‌లోని సహర్సా జిల్లాలో పర్యావరణ ప్రేమికులను తీవ్రంగా కలచివేసే విచారకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జీవ వైవిధ్యానికి ఎంతో కీలకమైన, అత్యంత అరుదైన గంగోత్రి డాల్ఫిన్‌ను ఒక మత్స్యకారుడు వేటాడి క్రూరంగా ప్రవర్తించాడు. కోసి నదిలో చేపల వేటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన సదరు మత్స్యకారుడిని బీహార్ పోలీసులు , అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరలైన దారుణ దృశ్యాలు

మత్స్యకారుడు కోసి నదిలో చేపలు పట్టడానికి వేసిన వలలో అనుకోకుండా ఒక అరుదైన గంగోత్రి డాల్ఫిన్ చిక్కుకుంది. చట్టప్రకారం , మానవత్వంతో ఆలోచిస్తే దానిని వెంటనే తిరిగి నది నీటిలోకి సురక్షితంగా వదిలేయాలి. కానీ ఆ మత్స్యకారుడు అలా చేయకుండా డాల్ఫిన్‌ను మోసుకుంటూ తన ఇంటికి తీసుకెళ్లాడు.

ఆ దారిలో వెళ్తున్న ఒక బాటసారి ఈ వింత దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. వీడియోలో సదరు మత్స్యకారుడు డాల్ఫిన్ శరీరం నుంచి నూనెను ఎలా తీయవచ్చో మాట్లాడుతుండటం స్పష్టంగా వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియా వేదికల్లోకి రాగానే తీవ్ర దుమారం రేపింది. నెటిజన్ల నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమవ్వడంతో, ఈ దృశ్యాలు అటవీ శాఖ అధికారులు , జిల్లా యంత్రాంగం దృష్టికి వెళ్లాయి. దాంతో వారు వెంటనే స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

అధికారుల గాలింపు చర్యలు , నిందితుడి అరెస్ట్

తనపై పోలీస్ కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న నిందితుడు అరెస్ట్ భయంతో వెంటనే పరారై అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో అటవీ శాఖ అధికారులు , బీహార్ పోలీసులు ప్రత్యేక బృందాలుగార్పడి అతడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల పాటు విస్తృతంగా శోధించిన అనంతరం, మూడవ రోజున పోలీసులు అతడిని విజయవంతంగా పట్టుకోగలిగారు.

ఈ సందర్భంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఓం ప్రకాష్ మీడియాకు సమాచారం ఇస్తూ, జాతీయ జలచరమైన డాల్ఫిన్‌ను వేటాడి చంపినందుకు నిందితుడిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం అతడిని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారని, విచారణ పూర్తయిన తర్వాత చట్టపరమైన చర్యల కోసం జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తామని వివరించారు.

చట్టపరమైన రక్షణ , కఠినమైన శిక్షలు

గంగా, బ్రహ్మపుత్ర , మేఘనా నదీ వ్యవస్థల్లో మాత్రమే కనిపించే ఈ గంగోత్రి డాల్ఫిన్లు అంతరించిపోతున్న అరుదైన మంచినీటి జీవులు. మన దేశంలో ఇవి 'జాతీయ జలచరం'గా గుర్తింపు పొందాయి. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం డాల్ఫిన్లకు అత్యున్నత స్థాయి చట్టపరమైన రక్షణ ఉంది. వీటిని వేటాడటం, పట్టుకోవడం లేదా చంపడం వంటి చర్యలను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.

ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం, రక్షిత జాతులకు హాని తలపెట్టిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంది. నదీ వ్యవస్థల స్వచ్ఛతకు, పర్యావరణ సమతుల్యతకు ప్రతీకగా నిలిచే ఇలాంటి జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story