Toguta: తొగుటలో ధాన్యం కొనుగోళ్లు నిలిచివేత.. రైతుల ఆవేదన
Toguta: తొగుటలో 10 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ నేత రాంరెడ్డి విమర్శలు.
Toguta
Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై చూపుతున్న శ్రద్ధ, వాస్తవ కొనుగోళ్లలో కనిపించడం లేదని ఆయన అన్నారు.
తొగుట మార్కెట్ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 10 రోజులుగా పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని తెలిపారు. మార్కెట్లో సుమారు 50 టన్నుల వరకు ధాన్యం పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన కొనుగోలు సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. మొక్కజొన్న పంట కూడా భారీగా వచ్చినప్పటికీ, ఆశించినంత కొనుగోళ్లు జరగడం లేదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పూర్తయిందని చెబుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి ఏ చర్యలు తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.




