Razole: ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో చర్చ జరిగే వరకు ఉద్యమం రత్నాకర్
Razole: రాజోలులో ఆర్ఏసీసీఎస్ (RACCS) వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.ఎస్. రత్నాకర్ ప్రెస్ మీట్. ఎస్సీ వర్గీకరణపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని పిలుపు.
Razole: ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో చర్చ జరిగే వరకు ఉద్యమం రత్నాకర్
రాజోలు: ఎస్సీ వర్గీకరణ అంశం ముగిసిపోయిందనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిగి రాజ్యాంగబద్ధ ప్రక్రియలో తగిన సవరణలు జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని RACCS (Roar Against Categorisation Conspiracy of SC's) వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.ఎస్. రత్నాకర్ స్పష్టం చేశారు.
డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని రోటరీ క్లబ్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా వందలాది ఎస్సీ ఉపకులాలు ఉన్నప్పటికీ, ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం నిర్వహించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఎస్సీల్లో మాలలే అన్ని రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతున్నారనే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అలాంటి ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని, దళిత సమాజ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు. ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
"ఎస్సీ వర్గీకరణపై చట్టాలు వచ్చాయని, ఇక మార్పులకు అవకాశం లేదనుకోవడం సరైంది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి చట్టం రాజ్యాంగ పరిధిలో సమీక్షకు లోబడి ఉంటుంది. పార్లమెంట్లో చర్చ జరిగి తగిన సవరణలు చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకే మా ఉద్యమం శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది" అని రత్నాకర్ స్పష్టం చేశారు.
దళితుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణే తమ ఉద్యమ లక్ష్యమని పేర్కొన్న ఆయన, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కారణంగా దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగబద్ధంగా జరిగే ఉద్యమాలకు తమ సంస్థ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.




