Razole: రాజోలులో భావోద్వేగాల మధ్య ఎంపీటీసీల వీడ్కోలు సమావేశం!
Razole: కోనసీమ జిల్లా రాజోలు మండల పరిషత్ ఎంపీటీసీల చివరి సర్వసభ్య సమావేశం జరిగింది.
Razole: రాజోలులో భావోద్వేగాల మధ్య ఎంపీటీసీల వీడ్కోలు సమావేశం!
రాజోలు: రాజోలు మండల పరిషత్లో ఎంపీటీసీల చివరి సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీతో ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎంపీపీ కడలి శ్రీదుర్గ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హాజరయ్యారు.
ఐదేళ్ల పదవీకాలంలో ప్రజల సమస్యలను పరిష్కరించి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని భావించినప్పటికీ నిధుల కొరత, అధికారిక పరిమితుల కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలను చెప్పినప్పుడు వాటిని పరిష్కరించలేకపోయిన సందర్భాలు బాధ కలిగించాయని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
అదేవిధంగా గత మూడేళ్లుగా ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. రాజోలులో డంపింగ్యార్డు ఏర్పాటుకు రెండున్నర ఎకరాల స్థలం కేటాయించామని తెలిపారు. సుమారు రూ.60 లక్షలతో డంపింగ్యార్డును అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ఇంటింటికీ మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా, మురుగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఐదేళ్లుగా ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఎంపీటీసీలు గుర్తుచేసుకున్నారు. మండలంలో ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఎంపీటీసీలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ మట్టా శైలజ, ఎంపీడీవో కె. వెంకటేశ్వరరావు, ఉప మండల అధ్యక్షులు ఇంటిపల్లి ఆనందరాజు, పొలమూరి శ్యాంబాబు, తాటిపాక మార్కెట్ యార్డు కమిటీ అధ్యక్షురాలు కేతా వెంకటలక్ష్మి, మండల స్థాయి ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.




