Rajahmundry: రాజమండ్రి నగరపాలక సంస్థలో పారిశుధ్య పనులపై సమగ్ర సమీక్ష
Rajahmundry: రాజమహేంద్రవరం నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ప్రజారోగ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Rajahmundry: రాజమండ్రి నగరపాలక సంస్థలో పారిశుధ్య పనులపై సమగ్ర సమీక్ష
రాజమండ్రి: నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా కృషి చేసి.. మెరుగైన ఫలితాలు తీసుకురావాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లలో జరుగుతున్న పారిశుధ్య పనులపై ఆరా తీశారు.
ప్రతి ఒక్క ఉద్యోగి విధిగా రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని.. రోజువారీ కార్యకలాపాలను అందులో నమోదు చేయవలసిందిగా సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఉదయం 6:30 కల్లా డోర్ టూ డోర్ చెత్త సేకరణ ప్రారంభం కావాలని ఆదేశించారు. చెత్త సేకరణ వాహనాలన్ని పూర్తి కండిషన్లో ఉన్నాయని.. కనుక క్రమం తప్పకుండా రోజూ ఇంటింటి చెత్త సేకరణ సజావుగా జరగాలన్నారు.
ఎక్కడా జీవీపీలు(గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు) కనపడకూడదని స్పష్టం చేశారు. రోజుకు 100 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే 'బల్క్ వేస్ట్ జనరేటర్లు' అయిన హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్ మెంట్లు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నైట్ శానిటేషన్ పై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని.. ఇందుకు సంబంధించిన ఫోటోలను గ్రూపులో అప్ లోడ్ చేయాలన్నారు.
అదేవిధంగా మైనర్, మీడియం డ్రెయిన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని.. వర్షాలు కురిసే సమయంలో కాలువల్లో నీరు సజావుగా ప్రవహించే విధంగా ఉండాలన్నారు. అలాగే పారిశుధ్య కార్యక్రమాలలో "సిటిజన్ ఫీడ్బ్యాక్" అత్యంత కీలకమని.. పౌరుల భాగస్వామ్యం ద్వారానే సేవలు మెరుగవడంతో పాటు సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, సచివాలయ శానిటరీ సెకట్రరీలు, ఇతర ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.




