Antharvedi Pallipalem: అంతర్వేదిలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన కచిడి చేపలు
Antharvedi Pallipalem: అంతర్వేది పల్లిపాలెంలో మత్స్యకారుల వలకు చిక్కిన తొమ్మిది కచిడి చేపలు. రూ.లక్షకు కొనుగోలు చేసిన వ్యాపారి. అంతర్జాతీయ మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్.
Antharvedi Pallipalem: అంతర్వేదిలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన కచిడి చేపలు
అంతర్వేది పల్లిపాలెం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పల్లిపాలెంలోని మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారుల వలకు తొమ్మిది కచిడి చేపలు చిక్కాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు సోమవారం ఈ అరుదైన చేపలు లభించాయి. వీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.
ఈ తొమ్మిది కచిడి చేపలను స్థానిక వ్యాపారి మొత్తం రూ.లక్షకు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు తెలిపారు. కచిడి చేపలు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉండటంతో వీటికి అధిక ధర పలుకుతోంది. ముఖ్యంగా మగ కచిడి చేపల పొట్ట భాగాలను ఔషధాల తయారీలో వినియోగిస్తారని, వాటికి విదేశీ మార్కెట్లో భారీగా గిరాకీ ఉంటుందని వారు వివరించారు.
అయితే, ఈసారి వలకు చిక్కిన వాటిలో ఎక్కువగా ఆరు,ఏడు కిలోల ఆడ కచిడి చేపలు ఉండటంతో ఆశించిన స్థాయిలో ధర రాలేదని తెలిపారు. మగ కచిడి చేపలు లభించి ఉంటే మరింత అధిక ధర పలికేదని మత్స్యకారులు పేర్కొన్నారు. అయినప్పటికీ రూ.లక్ష ధర లభించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.




