Amalapuram: హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక నిఘా పెట్టండి.. కలెక్టర్ ఆదేశం!

Amalapuram: మాతా, శిశు మరణాల రేటును సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు.

PRABHU, RAZOLE
Published on: 11 Jun 2026 4:52 PM IST
Amalapuram
X

Amalapuram: హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక నిఘా పెట్టండి.. కలెక్టర్ ఆదేశం!

Amalapuram: డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ సూచించారు.

కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్భిణీల నమోదు, వైద్య పరీక్షలు, హైరిస్క్ గర్భాల గుర్తింపు, నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పీఎచ్‌సీ, సీహెచ్‌సీల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ల్యాబ్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైతే ఉన్నత ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. నవజాత శిశు సంరక్షణ యూనిట్లను బలోపేతం చేయడంతో పాటు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

గ్రామస్థాయి నుంచి గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. అందరి కృషితో జిల్లాలో మాతా-శిశు మరణాల రేటును సున్నాకు తీసుకురావడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం. దుర్గారావు దొర తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story