Razole: మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ రాజోలులో బారులు తీరిన లబ్ధిదారులు!
Razole: రాజోలులో అగ్నికులక్షత్రియ మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్. సర్టిఫికెట్ల కోసం ఫిషర్మెన్ కార్యాలయం వద్ద పోటెత్తిన మత్స్యకారులు.
Razole: మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ రాజోలులో బారులు తీరిన లబ్ధిదారులు!
Razole: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ముందడుగు వేసింది. 50 సంవత్సరాలు నిండిన అగ్నికులక్షత్రియ మత్స్యకారులకు నెలనెలా పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాజోలు నియోజకవర్గంలోని మత్స్యకారులు పెన్షన్ కోసం అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం శుక్రవారం రాజోలు ఫిషర్మెన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నియోజకవర్గ పరిధిలోని 49 ఫిషర్మెన్ సహకార సంఘాలకు చెందిన వందలాది మంది మత్స్యకారులు తమ మత్స్యకారుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం కార్యాలయం వద్ద బారులు తీరారు.
ధ్రువీకరణ పత్రాలు పొందిన అనంతరం వాటిని సంబంధిత సచివాలయాల్లో సమర్పించి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. దీంతో తమకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ అందుబాటులోకి రావడంపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ.. తమ జీవన పరిస్థితులను, వృద్ధాప్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ డిమాండ్కు ప్రభుత్వం స్పందించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మత్స్యకారులు.. తమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. పెన్షన్ పథకం తమ కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




