Markapuram: అధికారులను అడ్డుకున్న సుంకేసుల నిర్వాసితులు!
Markapuram: తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి, ఇళ్లు ఖాళీ చేయడానికి 6 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అధికారులను నిర్వాసితులు అడ్డుకున్నారు.
Markapuram: అధికారులను అడ్డుకున్న సుంకేసుల నిర్వాసితులు!
మార్కాపురం జిల్లా: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసులలో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఇళ్లను ఖాళీ చేయించేందుకు వచ్చిన అధికారులను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.
ఈ నెల 22న వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల ట్రయల్ రన్ నేపథ్యంలో సుంకేసుల గ్రామంలోని నిర్వాసితులను ఇళ్లు ఖాళీ చేయించేందుకు అధికారులు వెళ్లగా.. తమ సమస్యలు పరిష్కరించే వరకు గ్రామం ఖాళీ చేసే ప్రసక్తే లేదని నిర్వాసితులు తేల్చిచెప్పారు.
“మాకు కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలి.. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతకు కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలి.. అన్ని పరిహారాలు, పునరావాస ప్రయోజనాలు కల్పించిన తర్వాతే ఇళ్లు ఖాళీ చేస్తాం” అంటూ అధికారులతో నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు.
తమ సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు గ్రామం విడిచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.




