Singarayakonda: సింగరాయకొండలో ఉద్రిక్తత విద్యార్థి తౌషిక్ తల్లి ఆత్మహత్యాయత్నం!
Singarayakonda: సింగరాయకొండ శ్రీ చైతన్య స్కూల్ వద్ద కుమారుడి మృతికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న తౌషిక్ తల్లి మౌలాబీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Singarayakonda: సింగరాయకొండలో ఉద్రిక్తత విద్యార్థి తౌషిక్ తల్లి ఆత్మహత్యాయత్నం!
Singarayakonda: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ వద్ద తన కుమారుడి మృతిపై గత 15 రోజులుగా న్యాయపోరాటం చేస్తున్న తౌషిక్ తల్లి మౌలాబీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఓంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
తన కుమారుడు తౌషిక్ మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమంటూ మౌలాబీ ఆరోపిస్తున్నారు. తన కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ గత 15 రోజులుగా శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళన చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు.
ఫిబ్రవరి 14న పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల తౌషిక్ బాత్రూంలో టవల్తో ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తన కుమారుడి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని తౌషిక్ తల్లి డిమాండ్ చేస్తున్నారు.
కుమారుడి మృతికి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ మౌలాబీ గత కొన్ని రోజులుగా కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నారు. తౌషిక్ మృతి ఆత్మహత్యా.. హత్యా? అనే అంశంపై కుటుంబ సభ్యుల ఆరోపణలు, అనుమానాల నేపథ్యంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.




