Giddalur: గిద్దలూరులో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి!
Giddalur: గిద్దలూరులో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఘనంగా నిర్వహించారు.
Giddalur: గిద్దలూరులో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి!
గిద్దలూరు: స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా గిద్దలూరులో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జాడి శ్వేత మాట్లాడుతూ, సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవితం పోరాటానికి, త్యాగానికి, సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ధైర్యంగా పాల్గొనడమే కాకుండా, స్వాతంత్ర్యానంతరం రైతులు, గీత కార్మికులు, వెనుకబడిన వర్గాలు మరియు అణగారిన ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.
“పదవుల కోసం కాకుండా ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న. బీసీల ఆత్మగౌరవాన్ని రాజకీయ, సామాజిక ఉద్యమంగా మలిచిన ఆయన ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లచ్చన్న గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. యువత ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ బి.సి.సంక్షేమ సంఘము అధ్యక్షుడు అద్దంకి. మధుసూధనరావు, శాలివాహన సంఘము నాయకులు సుండి.వెంకటరమణ,నాగేళ్ల. వెంకట మోహన్, విశ్వబ్రాహ్మణ సంఘ సేవకులు నీలోజి.సురభయ్య, రజక సంఘ వైస్ ప్రెసిడెంట్ అలసందల పాండు మరియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు ప్రముఖులు పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఘనంగా నివాళులు అర్పించారు.




