Markapuram: విద్యార్థినిని బెదిరించి రూ. 8 లక్షల బంగారం కాజేసిన లెక్చరర్!
Markapuram: మార్కాపురం ప్రైవేట్ కాలేజీలో దారుణం.
Markapuram: విద్యార్థినిని బెదిరించి రూ. 8 లక్షల బంగారం కాజేసిన లెక్చరర్!
మార్కాపురం: పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న కుందూరు రామాంజనేయరెడ్డి అనే వ్యక్తిని విద్యార్థిని వద్ద నుంచి బంగారు ఆభరణాలు బలవంతంగా అపహరించిన కేసులో మార్కాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు గత రెండు సంవత్సరాలుగా కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకుడిగా పనిచేస్తూ, చదువులో సహాయం చేస్తానని, మార్కులు మెరుగుపరుస్తానని నమ్మబలికి ఓ విద్యార్థినితో సన్నిహితంగా వ్యవహరించాడు. ఈ క్రమంలో జనవరి 1 న విద్యార్థిని ధరించిన బంగారు ఆభరణాలను పరిశీలిస్తానని చెప్పి స్టాఫ్ రూమ్లోకి తీసుకెళ్లి వాటిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు.
అంతేకాకుండా ఈ విషయాన్ని బయట చెప్పినా, తల్లిదండ్రులకు తెలిపినా పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని, అవసరమైతే ప్రాణహాని కలిగిస్తానని బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది. భయంతో విద్యార్థిని కొంతకాలం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచగా, తల్లిదండ్రుల ఒత్తిడితో జరిగిన విషయాన్ని వెల్లడించింది.
విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మార్కాపురం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి, జూన్ 4న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 52.341 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోగా, వాటి విలువ సుమారు రూ.8.32 లక్షలుగా గుర్తించారు.
విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మార్కాపురం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి, జూన్ 4న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 52.341 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోగా, వాటి విలువ సుమారు రూ.8.32 లక్షలుగా గుర్తించారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ యు. నాగరాజు, సీఐ ఎం.డి.కె. అల్తాఫ్ హుస్సేన్, టౌన్ ఎస్ఐ పి. విశ్వనాథ రెడ్డితో పాటు దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.




