Ongole: మూడు భాగాలుగా మారిన ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్!
Ongole: ఐదు దశాబ్దాల ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ ప్రస్థానానికి తెర. ఒంగోలు, మార్కాపురం, బాపట్ల కేంద్రాలుగా మూడు జడ్పీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.
Ongole: మూడు భాగాలుగా మారిన ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్!
Ongole: ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర 56 మండలాల పరిధి ఎన్నో పాలకవర్గాలు ఎన్నో రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచిన ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ ప్రస్థానానికి ఇక తెరపడింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా కొనసాగిన ఉమ్మడి జడ్పీ వ్యవస్థను ప్రభుత్వం తాజాగా పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఒంగోలు, మార్కాపురం కేంద్రాలుగా రెండు జడ్పీలు ఏర్పడుతుండగా మరో ఎనిమిది మండలాలు బాపట్ల జడ్పీ పరిధిలోకి వెళ్లనున్నాయి.
ఒకప్పుడు 56 మండలాలు ఇప్పుడు మూడు జడ్పీలు మండలాల వ్యవస్థ ఏర్పడిన తర్వాత 56 మండలాలతో కొనసాగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్.. జిల్లాల విభజన జరిగినా పాత పరిధిలోనే కొనసాగింది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి పరిపాలనా సరిహద్దులు మారాయి కానీ ఉమ్మడి జడ్పీ మాత్రం యథాతథంగా కొనసాగింది.
ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న వేళ ప్రభుత్వం జడ్పీలను కొత్త జిల్లాల ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించింది. దీంతో దశాబ్దాలుగా కొనసాగిన ఉమ్మడి జడ్పీ వ్యవస్థకు అధికారికంగా ముగింపు పలికినట్లైంది.
ఇకపై ఒంగోలు కేంద్రంగా 27 మండలాలతో ప్రకాశం జిల్లా పరిషత్ కొనసాగనుంది. మార్కాపురం కేంద్రంగా 21 మండలాలతో కొత్త జిల్లా పరిషత్ ఏర్పడనుంది. మరోవైపు చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, మార్టూరు, యద్దనపూడి మండలాలు బాపట్ల జడ్పీ పరిధిలోకి వెళ్లనున్నాయి.
ఈ మార్పు కేవలం మండలాల విభజన మాత్రమే కాదు.. స్థానిక రాజకీయ సమీకరణాల్లోనూ కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఇంతకాలం ఒకే జడ్పీ పరిధిలో ఉన్న ప్రాంతాలు.. ఇక వేర్వేరు పాలనా కేంద్రాల పరిధిలోకి వెళ్లనున్నాయి. కొత్త జడ్పీల నిర్వహణకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లా పరిషత్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత జడ్పీ పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబరు 24తో ముగియనుంది. ఆ తర్వాత కొత్త జిల్లాల పరిధులకు అనుగుణంగా జడ్పీల పరిపాలన ప్రారంభం కానుంది.
56 మండలాలు ఒకే జడ్పీ ఐదు దశాబ్దాల ప్రస్థానం! ఒకే గొడుగు కింద సాగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ ఇక మూడు భాగాలైంది. ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జడ్పీ.. మార్కాపురం కేంద్రంగా కొత్త జడ్పీ మరో ఎనిమిది మండలాలతో బాపట్ల జడ్పీ పరిధి.. ఇలా ఉమ్మడి జడ్పీ చరిత్ర ముగిసింది. ఐదు దశాబ్దాల చరిత్రకు ముగింపు పలుకుతూ.. కొత్త సరిహద్దుల్లో కొత్త పాలన.. కొత్త రాజకీయ లెక్కలకు శ్రీకారం పలికింది.




