Markapuram: మార్కాపురంలో ఏబీఎం హైస్కూల్‌కు పునర్జీవం

Markapuram: మార్కాపురం పట్టణంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఏబీఎం హైస్కూల్ కోర్టు తీర్పుతో పునఃప్రారంభమైంది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 July 2026 1:24 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో ఏబీఎం హైస్కూల్‌కు పునర్జీవం

మార్కాపురం:మార్కాపురం పట్టణ విద్యా చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఏబీఎం హైస్కూల్ మరోసారి విద్యార్థుల సందడితో కళకళలాడనుంది. దశాబ్దాల పాటు వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి పేరు గాంచిన ఈ విద్యాసంస్థ, 2024లో మూతపడిన అనంతరం కోర్టు అనుకూల తీర్పుతో తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేతుల మీదుగా పాఠశాల ఘనంగా పునఃప్రారంభమైంది.

1974లో స్థాపించబడిన ఏబీఎం హైస్కూల్ మార్కాపురం విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల వెనుక భాగంలో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే పాఠశాల 150 ఏళ్ల వేడుకల సందర్భంగా తన వంతు సహాయంగా రూ.5 లక్షలు అందజేస్తానని ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏబీఎం హైస్కూల్ పూర్వ విద్యార్థులందరూ ఒక్కటై తమ మాతృసంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పాఠశాల పునఃప్రారంభం మార్కాపురం విద్యారంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, రాబోయే తరాలకు నాణ్యమైన విద్య అందించే కేంద్రంగా ఏబీఎం హైస్కూల్ మళ్లీ నిలవాలని ఆకాంక్షించారు.

పాఠశాల పునఃప్రారంభంతో పూర్వ విద్యార్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, మార్కాపురం విద్యా చరిత్రలో ఇది మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం అని అభిప్రాయపడ్డారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story