Markapuram: ఎన్యూమరేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు.. కలెక్టర్ విజయ
Markapuram: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని మార్కాపురం జిల్లా కలెక్టర్ సిబ్బందిని హెచ్చరించారు.
Markapuram: ఎన్యూమరేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు.. కలెక్టర్ విజయ
Markapuram: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత హెచ్చరించారు.
మంగళవారం త్రిపురాంతకం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియలలో జాప్యం చోటుచేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని సూచించారు.
నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల వారీగా పురోగతి వివరాలను పరిశీలించిన కలెక్టర్, పనితీరు సంతృప్తికరంగా లేని సిబ్బందిని మందలించారు. సమయం తక్కువగా ఉన్నందున ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో ముందువరుసలో నిలిపేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా పనితీరులో మార్పు తీసుకువచ్చి లక్ష్య సాధనకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మార్కాపురం ఆర్డీవో ఎం. వెంకట శివరామిరెడ్డి, ఎస్డీసీ సత్యనారాయణ, నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




