Giddalur: గిద్దలూరులో ఉద్యానాభివృద్ధి ప్రణాళికపై అవగాహన సదస్సు
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరులో సమగ్ర ఉద్యానాభివృద్ధి ప్రణాళికపై ఆర్ఎస్కే సిబ్బందికి అవగాహన కల్పించిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి జన్నమ్మ.
Giddalur: గిద్దలూరులో ఉద్యానాభివృద్ధి ప్రణాళికపై అవగాహన సదస్సు
గిద్దలూరు: గిద్దలూరు మండలంలో సమగ్ర ఉద్యానాభివృద్ధి ప్రణాళిక (Integrated Horticulture Development Plan - IHDP) అమలుపై ఆర్ఎస్కే (రైతు సేవా కేంద్రం) సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి (DHO) శ్రీమతి జన్నమ్మ హాజరై ప్రణాళిక యొక్క లక్ష్యాలు, అమలు విధానం మరియు సిబ్బంది పాత్రను వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఉద్యానాభివృద్ధి ప్రణాళికను క్లస్టర్ విధానంలో అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మరియు బెస్తవారిపేట మండలాలు మొదటి క్లస్టర్గా ఎంపికయ్యాయని, ఈ ప్రాంతాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
ప్రణాళికలో భాగంగా రైతుల ఆదాయాన్ని పెంచడం, ఉద్యాన పంటల ఉత్పాదకతను మరియు నాణ్యతను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా ఉత్పాదకత పెంపు (Potential for Productivity Enhancement), నాణ్యత పెంపు (Quality Enhancement), పంట అనంతర యాజమాన్య పద్ధతుల నిర్వహణ (Post Harvest Management - PHM) ఉద్యాన యాంత్రీకరణ (Farm Mechanization), మార్కెటింగ్ మౌలిక సదుపాయాల కల్పన (Creation of Marketing Infrastructure) వంటి అంశాలను విపులంగా వివరించారు.
అదేవిధంగా వ్యక్తిగత నీటి కుంటలు, సామూహిక నీటి కుంటలు, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగు వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు, వాటి ప్రయోజనాలను వివరించారు.
ఈ పథకాన్ని గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం లో రైతు సేవా కేంద్రం సిబ్బంది కీలక పాత్ర పోషించాలని, రైతులకు విస్తృత అవగాహన కల్పించి అర్హులైన రైతులను గుర్తించి పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సూచించారు.
ఈ సమావేశంలో గిద్దలూరు మండలం ఉద్యాన శాఖ అధికారి శ్వేత ఆధ్వర్యంలో ఆయా మండలాల రైతుసేవా కేంద్రం సిబ్బంది, (గ్రామ ఉద్యాన/వ్యవసాయ/పట్టు పరిశ్రమ సహాయకులు) పాల్గొన్నారు.




