Markapuram: దోర్నాల: ఎనిమిది రోజులుగా దాహంతో గిరిజన గూడెం!
Markapuram: దోర్నాల మండలం కడపరాజుపల్లె పనుకుమడుగు గిరిజన గూడెంలో 8 రోజులుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Markapuram: దోర్నాల: ఎనిమిది రోజులుగా దాహంతో గిరిజన గూడెం!
మార్కాపురం: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం దోర్నాల మేజర్ పంచాయతీ పరిధిలోని కడపరాజుపల్లె గ్రామంలోని పనుకుమడుగు గిరిజన గూడెంలో ఎనిమిది రోజులుగా త్రాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గూడెంలో ఉన్న మూడు త్రాగునీటి బోర్లు పాడైపోవడంతో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
త్రాగునీటి సమస్యను పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోయిందని, ఫోన్ చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎంపీడీవోకు కూడా సమస్యను వివరించి, పాడైన మూడు బోర్లను బాగు చేయించాలని కోరినట్లు తెలిపారు.
వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన కాలువలో నీరు ప్రవహిస్తుండటంతో పగటి సమయంలో పోలీసుల భయంతో కాలువ వద్దకు వెళ్లలేక, రాత్రివేళల్లో అక్కడి నీటిని తీసుకెళ్లి అవసరాలు తీర్చుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న గిరిజన గూడెం ప్రజల సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
అదేవిధంగా గూడెంలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు గుండారెడ్డి, రమణారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.




