Markapuram: ప్రశాంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు వెలిగొండ పర్యటన!
Markapuram: మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటన పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది.
Markapuram: ప్రశాంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు వెలిగొండ పర్యటన!
మార్కాపురం: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరైన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసింది.
పర్యటన సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి రాకకు ముందు హెలిప్యాడ్, వీఐపీ రూట్, జలహారతి జరిగే ప్రాంతం, పైలాన్, ప్రాజెక్టు గేట్లు, ప్రజావేదిక, పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు వద్ద జలహారతిలో పాల్గొని, పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పటిష్టమైన ప్రణాళికతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
బందోబస్తు విధుల్లో పాల్గొన్న జలహారతి, ప్రజావేదిక, రూట్, ట్రాఫిక్ విభాగాల అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పటిష్టమైన ప్రణాళికతో విధులు నిర్వహిస్తే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. పర్యటన విజయవంతానికి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.




