Nandipet: నందిపేట్లో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ 10 తులాల బంగారం స్వాధీనం
Nandipet: నందిపేట్లో ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. అంతర్రాష్ట్ర నేరస్థుడు షేక్ ఖయ్యుమ్ను అరెస్ట్ చేసి 10 తులాల బంగారం స్వాధీనం.
Nandipet Police Arrest Interstate Thief Recover 10 Tolas Gold
Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల నిఘా, పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అంతర్రాష్ట్ర నేరస్థుడిగా పేర్కొంటున్న అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పర్భణి ప్రాంతానికి చెందిన షేక్ ఖయ్యుమ్ రఫిక్ బేగ్ అలియాస్ షేక్ ఖయ్యుమ్ షేక్ రఫిక్ (23) నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు.
గతంలో మహారాష్ట్రలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్, కర్ణాటకలోని బీదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2023లో మహారాష్ట్రలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడి నుంచి నాలుగు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివిధ కేసుల్లో అతడు మూడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా మహారాష్ట్రలోని పర్భణి జిల్లా కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో పిస్టల్ విక్రయానికి సంబంధించిన కేసులో కూడా అతడు ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమైండ్ కు తరలించినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి తెలిపారు.




