Nellore: నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Nellore: నెల్లూరు వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలు సెప్టెంబర్ 7న జరగనున్నాయి. ఈ వేడుకలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
Nellore: నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Nellore: స్వర్ణభారత్ ట్రస్ట్, వెంకటాచలం (నెల్లూరు) రజతోత్సవాలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమానికి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం ఉదయం 11 గంటలకు వెంకటాచలం చేరుకోనున్న శ్రీ యోగి ఆదిత్య నాథ్ గారు, 11.30 గంటలకు అక్షర విద్యాలయం ప్రాంగణంలో ఉన్న సోమా నైపుణ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం 12.00 గంటలకు అక్షర విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం 2.00 గంటలకు స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకుని రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.
భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి మానసపుత్రికగా 25 ఏళ్ళ క్రితం ప్రభవించిన స్వర్ణభారత్ ట్రస్ట్ లక్షలాది మంది పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువత జీవితాల్లో వెలుగులు నింపింది. నైపుణ్యాభివృద్ధి ద్వారా వారి సాధికారికతకు బాటలు వేసింది.
ముచ్చింతల్ (హైదరాబాద్ చాప్టర్, ఆత్కూర్ (విజయవాడ చాప్టర్) ద్వారా సేవలను విస్తరిస్తూ... దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతకు ఉచిత వసతితో పాటు నైపుణ్య శిక్షణను అందించి వారు తమ కాళ్ళమీద నిలబడేలా చొరవ తీసుకుంది. సంపూర్ణ గ్రామీణ సాధికారత సాధనలో 25 ఏళ్ళ సేవా వసంతాలను పూర్తి చేసుకున్న స్వర్ణ భారత్ ట్రస్ట్... సెప్టెంబర్ 7, సోమవారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి నెల్లూరు వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో పాటు... స్వర్ణభారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత, భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి శ్రీ పొంగూరు నారాయణ, శాసనసభ సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహణా బృందం తెలియజేసింది.




