Sullurupeta: సీఐ మురళీకృష్ణ దాతృత్వం: పేదలకు ఉచిత ఉపకరణాల పంపిణీ!
Sullurupeta: సూళ్ళూరుపేట సీఐ మురళీకృష్ణ చొరవతో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ చేతుల మీదుగా నిరుపేదలకు ఉచిత తోపుడు బండ్లు, వీల్ చైర్ల పంపిణీ జరిగింది.
Sullurupeta: సీఐ మురళీకృష్ణ దాతృత్వం: పేదలకు ఉచిత ఉపకరణాల పంపిణీ!
బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ప్రజాసేవలో సరికొత్త అధ్యాయం!
– సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ చొరవతో ఉచిత ఉపకరణాల పంపిణీ
– ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా తోపుడు బండ్లు, వీల్ చైర్ల అందజేత
సూళ్ళూరుపేట రిపోర్టర్ కెకెవి సుధాకర్
సూళ్ళూరుపేట:-
కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతతో నిరుపేదలకు అండగా నిలుస్తూ సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ స్థానిక ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ మాజీ అధ్యక్షుడైన సీఐ ఎం. మురళీకృష్ణ ప్రత్యేక చొరవతో శుక్రవారం సూళ్ళూరుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద బృహత్తర సేవా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
సూళ్ళూరుపేట సీఐగా బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఆయన పలు సంక్షేమ, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల పదో తరగతి పరీక్షల సమయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన స్టడీ మెటీరియల్, పరీక్షల సామగ్రిని ఉచితంగా అందించారు. అంతేకాకుండా తీవ్ర భానుమతాపానికి గురవుతున్న విద్యార్థులకు, కేంద్రాల వద్ద వేచివున్న తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించేలా మజ్జిగ పంపిణీ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, రోటరీ క్లబ్ ద్వారా స్థానిక నిరుపేదల జీవనోపాధికి పెద్దపీట వేశారు.
సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగప్రసాద్ సహకారంతో రూపొందించిన పలు ఉపకరణాలను ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. సూళ్ళూరుపేట పట్టణంలో పళ్లు, కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న ఐదుగురు నిరుపేదలకు ఉచితంగా తోపుడు బండ్లను పంపిణీ చేశారు. అలాగే ఉపాధి కోసం కష్టపడుతున్న ఇద్దరు రజకులకు రెండు ఇస్త్రీ బాక్సులను అందజేశారు.
దీంతో పాటు ప్రజా సౌకర్యార్థం, వికలాంగులు, రోగుల అవసరాల నిమిత్తం తడ మరియు సూళ్ళూరుపేట ప్రభుత్వ వైద్యశాలలకు, తడ కేజీబీవీ పాఠశాలకు, శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయానికి, కేర్తి ఎన్క్లేవ్కు కలిపి మొత్తం 5 వీల్ చైర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ... సీఐ మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే విధి నిర్వహణతో పాటు నిరుపేదల ఆకలి, కష్టాలను గుర్తించి ఎన్నో వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ప్రస్తుత, మాజీ అధ్యక్షులు కోగంటి గోపాలకృష్ణ, రావిపాటి శ్రీనివాసరావు, బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, స్థానిక నాయకులు ఆకుతోట రమేష్, పచ్చవ మాధవ నాయుడు, కిషోర్, సురేష్ నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.




