Rapur: ఘాట్ రోడ్డులో ప్రయాణికులను వణికిస్తున్న చిరుతల సంచారం!
Rapur: రాపూరు - చిట్వేల్ ఘాట్ రోడ్డుపై చిరుతల సంచారం ప్రయాణికులను వణికిస్తోంది. అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల విజ్ఞప్తి.
Rapur: ఘాట్ రోడ్డులో ప్రయాణికులను వణికిస్తున్న చిరుతల సంచారం!
Rapur: నెల్లూరు జిల్లా పరిధిలోని రాపూరు - చిట్వేల్ ఘాట్ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులను చిరుత పులుల సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా ఈ ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే వారికి తరచుగా చిరుత పులులు దర్శనమిస్తున్నాయి.
కొన్నిసార్లు రోడ్డుకు అడ్డంగా రావడం, మరికొన్నిసార్లు రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడలపై నిశ్చింతగా కూర్చుని ఉండటం చూసి వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, రాత్రి వేళల్లో ప్రయాణించే వారు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘాట్ రోడ్డు దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళుతుండటంతో, క్రూర మృగాలు హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్రమాదం జరగకముందే అటవీ శాఖ అధికారులు స్పందించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.




