Nellore: నెల్లూరులో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ పాఠశాల ప్రారంభం!

Nellore: నెల్లూరులో రూ.8.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్, ఎంపీ వేమిరెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 16 Sept 2026 2:51 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ పాఠశాల ప్రారంభం!

Nellore: కార్పోరేట్ హంగులతో నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో శిథిలావస్తలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసి కార్పోరేట్ స్కూళ్లను తలపించేలా సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

నెల్లూరు నగరంలో మొత్తం 15 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే వీఆర్ సీ స్కూల్ ను ఆధునీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం నెల్లూరు పట్టణం స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నెల్లూరు ఎంపీ, వీపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల భవనాలను రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం పాఠశాల మొత్తం కలియతిరిగి తరగతి గదులు, ల్యాబ్ లు, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరాతీశారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

"రూ.8.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి"

వీపీఆర్ ఫౌండేషన్ రూ.8.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్ ను అభివృద్ధి చేయడం జరిగింది. రెండు అంతస్థుల్లో భారీ నిర్మాణంతో 43 తరగతి గదులు అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులకు డిజిటల్ బోధన అందించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ లు, అధునాతన బెంచీలను ఏర్పాటుచేశారు. పాఠ్యపుస్తకాలకే విద్యను పరిమితం చేయకుండా ప్రయోగాత్మక, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కంప్యూటర్, రోబోటిక్స్, ఆస్ట్రో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, లాంగ్వేజ్ రూమ్‌లు తదితర ప్రత్యేక వసతులను కల్పించడం జరిగింది. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ మోడ్రన్ టాయిలెట్లను ఏర్పాటుచేశారు.

"విశాలమైన క్రీడా ప్రాంగణం అభివృద్ధి"

చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలనే లక్ష్యంతో పాఠశాలలో విశాలమైన క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎకరా స్థలంలో ప్లేగ్రౌండ్ ఏర్పాటుచేయడంతో పాటు ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు సిద్ధం చేశారు. అదనంగా కిడ్స్ ప్లే ఏరియా, సెన్సరీ పార్క్, అవుట్‌డోర్ జిమ్ వంటి ఆధునిక సదుపాయాలను కల్పించారు. సుమారు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సింథటిక్ కోర్టు ఏర్పాటుచేశారు.

"ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఆధునిక సదుపాయాల కల్పన"

నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యాబోధనకు అనువుగా పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది. ఒకే ప్రాంగణంలో పాఠశాల విద్యకు అవసరమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయం, కళలు, క్రీడలు, డిజిటల్ విద్య తదితర సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ఆధునిక సదుపాయాలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ఈ విద్యాయజ్ఞాన్ని మంత్రి లోకేష్ ముందుకు తీసుకెళ్తున్నారు.

"పైవేటు పాఠశాలలతో పోటీ పడాలి"

ఆధునీకరించిన పాఠశాలను ప్రారంభించిన అనంతరం పాఠశాల పనితీరుపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే.ప్రసాద్, ఇతర అధికారులతో మంత్రి సమీక్షించారు. లెర్నింగ్ అవుట్ కమ్స్ లో స్కూల్ వెనుకబడి ఉందని, ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గతేడాది పదో తరగతిలో 60.19 శాతం ఉత్తీర్ణత సాధించారని, ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టిసారించాలన్నారు. స్టూడెంట్ ఎన్ రోల్ మెంట్ కూడా తగ్గిందని, ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంపైనా మంత్రి ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పి. నారాయణ, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి.షరణి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE