Nellore: రొయ్యల సాగులో TPD వ్యాధి కలకలం.. శాస్త్రవేత్తల సూచనలు ఇవే!
Nellore: నెల్లూరు జిల్లాలో రొయ్యల సాగుకు పొంచి ఉన్న TPD వ్యాధి ముప్పు! ICAR-CIBA మరియు SIFT శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయి పర్యటన.
Nellore: రొయ్యల సాగులో TPD వ్యాధి కలకలం.. శాస్త్రవేత్తల సూచనలు ఇవే!
Nellore: నెల్లూరు జిల్లాలోని ఆక్వా రైతులకు రొయ్యల సాగులో ఎదురయ్యే వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ సంబంధిత వ్యాధులు మరియు TPD (Translucent Post Larval Disease)పై State Institute of Fisheries Technology (SIFT), Kakinada, NSPAAD (PMMSY) మరియు ICAR-CIBA, Chennai సంయుక్త బృందం అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా రైతులు పాటించవలసిన ముందస్తు జాగ్రత్తలు, వ్యాధి నివారణ చర్యలు మరియు ఉత్తమ సాగు నిర్వహణ విధానాల గురించి వారికి విపులంగా వివరించారు.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో, State Institute of Fisheries Technology (SIFT), Kakinada, NSPAAD (PMMSY) మరియు ICAR-CIBA, Chennai సంస్థల సంయుక్త బృందం మత్స్యశాఖ కమిషనర్ మరియు ICAR-CIBA డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు అనుమానిత చెరువులను సందర్శించింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో చెరువుల్లో రొయ్యల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, TPD వ్యాధి లక్షణాలు మరియు నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. అనుమానిత చెరువుల నుండి రొయ్యల మరియు నీటి నమూనాలను సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మరియు కోట మండలాలలోని చెరువులను సందర్శించి నమూనాలు సేకరించారు. అలాగే ఇందుకూరుపేట, టీపీ గూడూరు మరియు కోట మండలాల్లోని హ్యాచ్రీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సేకరించిన నమూనాలను విశ్లేషణ కోసం పంపించారు.
సందర్భంగా రైతులకు బయోసెక్యూరిటీ ప్రాముఖ్యత, నీటి మార్పిడి, చెరువు నిర్వహణ, చెరువు సిద్ధం, ఎండబెట్టడం వంటి అంశాలపై సూచనలు అందించారు. రొయ్యల సాగులో అనుసరించవలసిన ఉత్తమ నిర్వహణ విధానాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. హ్యాచ్రీ యాజమాన్యానికి పాటించవలసిన ప్రమాణాలు, సర్టిఫికేషన్ మరియు ట్రేసబిలిటీ అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు డా. కె. శాంతి వారి మార్గదర్శకత్వంలో మత్స్య అభివృద్ధి అధికారులు, గ్రామ స్థాయి మత్స్య సహాయకులు, SIFT అధికారులు, NSPAAD (PMMSY) మరియు ICAR-CIBA ప్రతినిధులు పాల్గొన్నారు. సేకరించిన నమూనాల విశ్లేషణ ద్వారా వ్యాధులను గుర్తించి, రైతులకు తగిన మార్గదర్శకాలు అందించడం ద్వారా ఆక్వా రంగంలో సుస్థిర అభివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు.




