Amit Shah: వందేమాతరం వివాదం.. కాంగ్రెస్పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Amit Shah: వందేమాతరం గేయంలో మొదటి రెండు చరణాలే పాడతామన్న కాంగ్రెస్ నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు.
Amit Shah: వందేమాతరం వివాదం.. కాంగ్రెస్పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Amit Shah: జాతీయ గేయం ‘వందేమాతరం’ను పూర్తిగా ఆలపించే విషయంలో అధికార భారతీయ జనతా పార్టీ (BJP), ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. వందేమాతర గేయం యొక్క తొలి రెండు చరణాలను మాత్రమే పాడతామంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) చేసిన ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం అనూహ్యమైనది, దేశ వ్యతిరేకమైనదని అమిత్ షా మండిపడ్డారు. "ఓటు బ్యాంకు మరియు అతివాద బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సమరయోధులను, గేయ రచయిత బంకిం చంద్ర ఛటర్జీని అవమానిస్తోంది. 1937లో కూడా ముస్లింలను బుజ్జగించేందుకే వందేమాతరాన్ని రెండుగా విడగొట్టారు. నాటి ఆ చారిత్రక తప్పిదమే ద్విజాతి సిద్ధాంతం బలపడటానికి, చివరకు దేశ విభజనకు పునాది వేసింది" అని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులను మోదీ ప్రభుత్వం సరిదిద్దిందని హోంమంత్రి స్పష్టం చేశారు. జాతీయ సమైక్యతను బలోపేతం చేసేందుకు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించాలని మోదీ ప్రభుత్వం చట్టబద్ధమైన నిబంధన తెచ్చిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ దీనిని విస్మరిస్తూ మళ్లీ పాత తప్పునే పునరావృతం చేస్తోందని ఆరోపించారు.
వందేమాతరాన్ని రెండుగా విభజించడం వల్ల గతంలో తీవ్ర పర్యవసానాలు అనుభవించామని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ వైఖరిని యావత్ దేశం ముక్తకంఠంతో వ్యతిరేకించాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
కాగా, బుధవారం జరిగిన సిడబ్ల్యూసి (CWC) సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. 1937 నాటి పార్టీ తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, వందేమాతరంలో తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని పునరుద్ఘాటించింది.




