Uttarakhand Rain : ఉత్తరాఖండ్లో వాన బీభత్సం.. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.!
Uttarakhand Rain : ఉత్తరాఖండ్ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొండ ప్రాంతాల నుంచి మైదానాల వరకు దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పలుచోట్ల
Uttarakhand Rain
Uttarakhand Rain : ఉత్తరాఖండ్ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొండ ప్రాంతాల నుంచి మైదానాల వరకు దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధాని డెహ్రాడూన్తో పాటు మరో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు.
ఎత్తైన కొండల్లో స్నోఫాల్ స్టార్ట్
మరోవైపు చమోలి జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చమోలి సరిహద్దులోని మానా వ్యాలీలో అప్పుడే చలిగాలులు మొదలయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీ బద్రీనాథ్ ధామ్, హేమకుండ్ సాహిబ్తో పాటు చినాప్ వ్యాలీ, సోనా శిఖర్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, కుంత్ ఖల్, కాగ్ భూషండి పరిసరాల్లో సీజన్ తొలి హిమపాతం (స్నోఫాల్) నమోదైంది.
రుద్రప్రయాగ్లో అలర్ట్ లెవెల్కు నదులు
రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలకనంద, మందాకిని నదుల నీటిమట్టాలు వార్నింగ్ లెవెల్కు అత్యంత దగ్గరగా చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గడచిన 24 గంటల్లో రుద్రప్రయాగ్ తహసీల్, ఉఖిమఠ్, జఖోలి ప్రాంతాల్లో 8 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో టెంపరేచర్స్ 23 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అవుతున్నాయి.
ప్రమాదకరంగా నీటిమట్టాలు
ఉదయం 8 గంటల సమయానికి అలకనంద నది నీటిమట్టం 625.90 మీటర్లకు చేరింది (దీని హెచ్చరిక స్థాయి 626 మీటర్లు, డేంజర్ లెవెల్ 627 మీటర్లు). మందాకిని నది నీటిమట్టం 624.90 మీటర్లుగా నమోదైంది (హెచ్చరిక స్థాయి 625 మీటర్లు, డేంజర్ లెవెల్ 626 మీటర్లు). వీటితో పాటు గంగానగర్ దగ్గర 800.17 మీటర్లు, గౌరీకుండ్ వద్ద 1973.85 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది.
రహదారులు బ్లాక్.. స్థానికులకు తిప్పలు
వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో ఒక స్టేట్ హైవే సహా 5 PWD రోడ్లు, 7 PMGSY గ్రామీణ రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. ముఖ్యంగా స్టేట్ హైవే 56లోని బన్స్వారా-కన్సిల్-చంద్నగర్-మోహన్ఖల్ మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే నేషనల్ హైవే, NPCC రోడ్లలో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.




