Supreme Court: లాయర్ నుంచి నేరుగా అత్యున్నత కోర్టు జడ్జిగా వి. మోహన.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురి నియామకం!

Supreme Court: సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 1 Jun 2026 11:21 AM IST
Supreme Court
X

Supreme Court: లాయర్ నుంచి నేరుగా అత్యున్నత కోర్టు జడ్జిగా వి. మోహన.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురి నియామకం!

Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సుప్రీం కోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

సుప్రీం కోర్టు కొత్త న్యాయమూర్తులు వీరే:

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సుప్రీం కోర్టు జడ్జీలుగా బాధ్యతలు చేపట్టనున్న వారు:

వి. మోహన (సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది)

జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌ (ప్రస్తుతం బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్)

జస్టిస్‌ షీల్‌ నాగు (ప్రస్తుతం పంజాబ్‌ హరియాణా హైకోర్టు చీఫ్ జస్టిస్)

జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ హైకోర్టు చీఫ్ జస్టిస్)

జస్టిస్‌ అరుణ్‌ పళ్లి (జమ్మూకశ్మీర్‌ హైకోర్టు చీఫ్ జస్టిస్)

లాయర్ టు సుప్రీం కోర్టు జడ్జి.. ఎవరీ వి. మోహన?

ఈ నియామకాల్లో అందరి దృష్టి సీనియర్ న్యాయవాది వి. మోహనపైనే నిలిచింది. ఈ జాబితాలో నేరుగా న్యాయవాది (బార్) కోటా నుంచి సుప్రీం కోర్టు జడ్జిగా ఎంపికైన ఏకైక వ్యక్తి ఈమె కావడం విశేషం. ఈమె నియామకంతో సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరింది.

వి. మోహన ప్రస్థానం:

1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఐదేళ్ల లా డిగ్రీ కోర్సు పూర్తి చేసిన మొదటి బ్యాచ్ విద్యార్థిని ఈమె కావడం విశేషం.

సుప్రీంకోర్టుకు చెందిన ప్రముఖ సీనియర్‌ న్యాయవాదులు ఇందు మల్హోత్రా, సీఎస్‌ వైద్యనాథన్‌ల వద్ద జూనియర్‌గా పనిచేశారు.

1996లో ప్రతిష్టాత్మక 'అడ్వకేట్ ఆన్ రికార్డ్' (AOR) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్వతంత్రంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో కపిల్‌ సిబల్, కె.కె. వేణుగోపాల్, పి. చిదంబరం, అరుణ్ జైట్లీ, అంద్యార్జున వంటి దేశంలోని అగ్రశ్రేణి న్యాయవాదులతో కలిసి విభిన్నకేసుల్లో పనిచేశారు.

న్యాయరంగంలో ఆమె ప్రతిభను గుర్తిస్తూ 2015 ఏప్రిల్‌ 23న ఆమెకు 'సీనియర్ న్యాయవాది' హోదా దక్కింది.

కొలీజియం సిఫార్సు చేసిన కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. కొత్త న్యాయమూర్తులు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story