Stampede: ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది మృతి
Stampede: బిహార్లోని నలంద జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శీతలామాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Stampede: ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది మృతి
Stampede: బిహార్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామునే తీవ్ర విషాదం నెలకొంది. నలంద జిల్లాలోని ప్రసిద్ధ శీతలామాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో (Stampede) ఎనిమిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే?
మంగళవారం కావడంతో శీతలామాతను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. క్యూ లైన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో భక్తుల మధ్య తోపులాట మొదలైంది. పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఊపిరాడక, కింద పడిపోయిన వారిపై నుంచి ఇతరులు వెళ్లడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు స్పందించి గాయపడిన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆలయ ఆవరణలో భద్రతా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణలో వైఫల్యాలు ఉన్నాయా అనే కోణంలో జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. భక్తుల మరణవార్తతో మృతుల కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది.




