Sadhguru: నేపాల్ వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన సద్గురు జగ్గీ వాసుదేవ్!

Sadhguru: హిమాలయ ప్రాంతంలో విపత్తులను ఎదుర్కొనేందుకు భారత్, చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్‌తో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రతిపాదించారు.

Arun Chilukuri
Published on: 31 Aug 2026 11:08 AM IST
Sadhguru
X

Sadhguru: నేపాల్ వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన సద్గురు జగ్గీ వాసుదేవ్!

Sadhguru: హిమాలయ ప్రాంతంలో సంభవించే ప్రాణాంతక విపత్తులను సంయుక్తంగా ఎదుర్కొనేందుకు భారత్, చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్ దేశాలతో కూడిన ‘ప్రత్యేక హిమాలయ బోర్డు’ను ఏర్పాటు చేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రతిపాదించారు. రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఈ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణ కోసం కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.

"నేపాల్ వరద బాధితుల సహాయ కార్యక్రమాల కోసం రూ.కోటి విరాళం ప్రకటిస్తున్నట్లు ఖాట్మండులో జరిగిన కార్యక్రమంలో సద్గురు వెల్లడించారు."

ఖాట్మండులో ఆదివారం జరిగిన ‘ఇన్‌ సాలిడారిటీ విత్‌ నేపాల్‌’ కార్యక్రమంలో సద్గురు మాట్లాడారు. హిమాలయ పర్వతాలకు మానవ నిర్మిత దేశాల సరిహద్దులు తెలియవని, ఈ ప్రాంతాన్ని ఒకే సమగ్ర పర్యావరణ వ్యవస్థగా భావించి రక్షించాలని అన్నారు. ఆలస్యం చేయకుండా ఈ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.

నేపాల్-టిబెట్ సరిహద్దులో ఇటీవల సంభవించిన భారీ వరదలతో వేలాది మంది గల్లంతయ్యారని, మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

విపత్తు సమయంలో చైనా వైపు గ్యిరోంగ్‌ ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న ఇషా సంస్థకు చెందిన కైలాశ్ యాత్ర సభ్యులు 77 మంది ఆచూకీ ఇంకా లభించలేదని, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఇషా వాలంటీర్లు కూడా గల్లంతైనట్లు ఆయన తెలిపారు.

ఈ విపత్తును నేపాల్ ఒక్కటే ఎదుర్కోవడం సాధ్యం కాదని, తక్షణ సహాయంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని పేర్కొంటూ నేపాల్ వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ప్రకృతి విపత్తులకు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కారణాలు ఆపాదించకూడదని, భౌతిక ఘటనలకు భౌతిక కారణాలే ఉంటాయని సద్గురు స్పష్టం చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో ‘కాల భైరవ కర్మ’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story