PM Modi: దేశవ్యాప్తంగా ఎండల దెబ్బ.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు..

PM Modi: దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

Arun Chilukuri
Published on: 27 May 2026 2:42 PM IST
PM Modi
X

PM Modi: దేశవ్యాప్తంగా ఎండల దెబ్బ.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు..

PM Modi: దేశవ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా మధ్య, వాయువ్య భారతంలో రాబోయే రోజుల్లో వడగాల్పుల (Heatwaves) తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు.

ప్రధాని మోదీ సూచించిన జాగ్రత్తలు ఇవే:

తీవ్రమైన ఎండల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని కోరారు.

వీలైనంత వరకు మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.

శరీరంలో డీహైడ్రేషన్ రాకుండా ఉండటానికి నీరు ఎక్కువగా తాగాలి.

ఈ మండుటెండల వల్ల పిల్లలు, వృద్ధులు, కార్మికులు, రైతులు ఎక్కువగా ప్రభావితమవుతారు. కాబట్టి ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్యాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలి.

మానవత్వంతో ఆలోచించి, ఇళ్లు మరియు దుకాణాల బయట పక్షులు, జంతువుల కోసం తాగునీటిని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

తల తిరగడం, వికారం (వాంతులు వచ్చేలా ఉండటం), విపరీతమైన అలసట వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ప్రధాని హెచ్చరించారు. చుట్టుపక్కల ఎవరైనా అకస్మాత్తుగా నీరసించి స్పృహ కోల్పోతే, వెంటనే వారిని నీడ ఉన్న ప్రదేశానికి తరలించి ప్రథమ చికిత్స అందించాలన్నారు. ఇటువంటి సమయాల్లో అప్రమత్తత ఒకరి ప్రాణాన్ని కాపాడుతుందని మోదీ పేర్కొన్నారు.

వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు:

రాబోయే రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో వడగాల్పులు అత్యంత తీవ్ర రూపం దాల్చవచ్చని ఐఎండీ హెచ్చరించింది.

తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, మే 29 నుంచి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story