Neha Bora : విద్యార్థుల ర్యాలీలో కలకలం.. ఐసా అధ్యక్షురాలు నేహా బోరాపై సిరా దాడి!
Neha Bora : జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా సాగుతున్న విద్యార్థి ఆందోళన ఉద్రిక్తంగా మారింది.
Neha Bora Ranchi Protest
Neha Bora : జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా సాగుతున్న విద్యార్థి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల నిరసన ప్రదర్శనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై శుక్రవారం ఒక వ్యక్తి నల్ల సిరా చల్లి దాడికి పాల్పడ్డాడు. జార్ఖండ్ అసెంబ్లీ దిశగా విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర సంచలనం నెలకొంది.
అసెంబ్లీ ముట్టడి ర్యాలీలో చోటుచేసుకున్న ఘటన
రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ బిర్సా చౌక్ సమీపానికి చేరుకోగానే, గుంపులో నుంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు వచ్చాడు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న నేహా బోరాతో పాటు కొందరు మహిళా నాయకురాళ్లపై అతను ఒక్కసారిగా నల్ల సిరా చల్లాడు. ఈ అనూహ్య ఘటనతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
"సిరా దాడికి భయపడేదే లేదు" - నేహా బోరా ధీమా
దాడి జరిగిన వెంటనే నేహా బోరా మీడియా వేదికగా స్పందిస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో లాఠీ ఛార్జీలు, పెల్లెట్ తుపాకీల కాల్పులనే ధైర్యంగా ఎదుర్కొన్నానని, ఈ చిన్న సిరా దాడికి తాను ఎంతమాత్రం భయపడనని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా పరీక్షల అవకతవకలపై విద్యార్థుల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని ఇటువంటి చర్యలతో అణచివేయలేరని పేర్కొన్నారు. ఈ సిరాను తాము గర్వంగా స్వీకరించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిందితుడి ఆరోపణలు - ఐసా నాయకుల విమర్శలు
పోలీసుల కస్టడీలోకి వెళ్లిన అనంతరం సదరు వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ, నేహా బోరా ఉమర్ ఖలీద్కు మద్దతు ఇస్తున్నారని, ఆమె చర్యలు నచ్చకనే తాను ఈ పనిచేశానని వ్యాఖ్యానించాడు. మరోవైపు, ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని, విద్యార్థుల హక్కుల పోరాటాన్ని బలహీనపరిచేందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని ఐసా నాయకులు ఆరోపిస్తున్నారు.
14వ రోజుకు చేరిన విద్యార్థుల ఉద్యమం
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ (JSSC CGL) పరీక్షల్లో భారీ ఎత్తున అవకతవకలు, పేపర్ లీక్లు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ప్రస్తుతం 14వ రోజుకు చేరింది. రద్దయిన పరీక్షలకు వెంటనే నూతన షెడ్యూల్ ప్రకటించాలని, ప్రైవేట్ ఏజెన్సీల భాగస్వామ్యాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలో ఉండగా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక చర్చలకు పిలుపు రాలేదని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి.




