Road Accident: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది బలి!

Road Accident: మహారాష్ట్రలోని నాసిక్‌లో పెను విషాదం. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం.

Arun Chilukuri
Published on: 4 April 2026 10:44 AM IST
Nashik Accident
X

Road Accident: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది బలి!

Nashik Road Accident: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తీరని విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం అందరినీ కలచివేస్తోంది.

ప్రమాదం జరిగిందిలా..

పోలీసుల కథనం ప్రకారం.. డిండోరీ ప్రాంతానికి చెందిన సునీల్ దత్తు దర్గుడే కుటుంబం శివాజీనగర్‌లో జరిగిన ఒక వేడుకకు హాజరయ్యారు. ఫంక్షన్ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, డిండోరీ సమీపంలో వీరి కారు అదుపుతప్పి పక్కనే ఉన్న లోతైన బావిలో పడిపోయింది. కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఎవరూ బయటపడలేకపోయారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు క్రేన్లు మరియు గజ ఈతగాళ్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి బావి నుంచి కారును, మృతదేహాలను వెలికితీశారు.

మృతుల వివరాలు:

ఈ ప్రమాదంలో సునీల్‌ దత్తు దర్గుడే(32), ఆయన భార్య రేష్మా, బంధువు ఆశా అనిల్‌ దర్గుడే(32)తో పాటు వారి కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. మరణించిన పిల్లల వయసు 7 నుండి 14 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతివేగమే ప్రమాదానికి కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story