PM Modi Video : జెన్‌జీకి ప్రధాని సందేశం.. షార్ట్‌కట్ మీ జీవితాన్ని దెబ్బతీస్తుంది.. జాగ్రత్త..!

PM Modi Video : రీల్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు , తక్షణ సంతృప్తి (Instant Gratification) సంస్కృతి రాజ్యమేలుతున్న నేటి కాలంలో దేశంలోని యువతకు (Gen Z)..

G Krishna
Published on: 12 Aug 2026 12:42 PM IST
PM-Modi
X

PM-Modi

PM Modi Video : రీల్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు , తక్షణ సంతృప్తి (Instant Gratification) సంస్కృతి రాజ్యమేలుతున్న నేటి కాలంలో దేశంలోని యువతకు (Gen Z) ప్రధాని నరేంద్ర మోదీ ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. విజయం సాధించడానికి దొంగదారులు తొక్కితే జీవితం నాశనమవుతుందని, కష్టపడి సరైన మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ 'ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు.

రైల్వే స్టేషన్ హెచ్చరిక.. ప్రధాని ఇచ్చిన పెద్ద పాఠం

రైల్వే స్టేషన్లలో తరచూ కనిపించే ఒక హెచ్చరిక బోర్డును ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ యువతకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని చెప్పారు. "చాలామంది ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించకుండా సమయం ఆదా అవుతుందని భావించి రైలు పట్టాలు దాటుతుంటారు. అలాంటి చోట్ల ఒక హెచ్చరిక రాసి ఉంటుంది.. 'షార్ట్‌కట్ విల్ కట్ యు షార్ట్' (షార్ట్‌కట్ మీ జీవితాన్ని దెబ్బతీస్తుంది) అని. నేటి యువత కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి" అని ప్రధాని పేర్కొన్నారు. అలాగే రకరకాల దిశల్లోకి దారి మళ్లించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. యువత ముందుకు సాగడానికి, వారు ఆరాధించే దిగ్గజాల ఆత్మకథలను తప్పక చదవాలని సూచించారు.

జెన్ జెడ్‌ను ఆకట్టుకునేలా డిజిటల్ మార్పులు

నేటి డిజిటల్ యంగ్ జనరేషన్‌కు మరింత చేరువయ్యేందుకు ప్రధాని మోదీ తన సోషల్ మీడియా వ్యూహంలో మార్పులు తెచ్చారు. ఇటీవల కాలంలో ఆయన సెల్ఫీ స్టైల్ వీడియోలు పోస్ట్ చేయడం, "హాయ్ ఫ్రెండ్స్" అంటూ పలకరించడం, "ఫస్ట్ ఇన్ మై బ్లడ్‌లైన్" వంటి వైరల్ పదబంధాలను ఉపయోగించడం చేస్తున్నారు. అలాగే సంప్రదాయ భారతీయ వస్త్రాలను ప్రోత్సహించేందుకు సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'GRWM' (గెట్ రెడీ విత్ మీ) ఫార్మాట్‌ను కూడా ఉపయోగిస్తున్నారు.

విద్యార్థుల ఆందోళనలు.. ప్రభుత్వ వ్యూహాత్మక అడుగులు

NEET-UG పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడం, ఆ పరిణామాలు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీయడం తెలిసిందే. ఈ నిరసనల తర్వాత ప్రభుత్వం యువతతో సంబంధాలను బలపరచుకోవడంపై దృష్టి పెట్టింది. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ శాఖలు యువత ఎక్కువగా ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉండాలని, ఇటీవల విదేశాంగ శాఖ స్నాప్‌చాట్‌లో కూడా అడుగుపెట్టింది. యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా సాధారణ శైలిలో వీడియోలను రూపొందించాలని ప్రధాని మోదీ తమ కేబినెట్ సహచరులకు సూచించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story