PM Modi: ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పోస్ట్ బ్లాక్.. ‘మెటా’ ప్రతినిధులకు కేంద్రం సమన్లు!

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పోస్ట్‌పై తాత్కాలికంగా ఆంక్షలు విధించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) సీరియస్ అయింది.

Arun Chilukuri
Published on: 30 July 2026 3:08 PM IST
PM Modi
X

PM Modi: ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పోస్ట్ బ్లాక్.. ‘మెటా’ ప్రతినిధులకు కేంద్రం సమన్లు!

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన ఒక పోస్ట్‌పై తాత్కాలికంగా ఆంక్షలు విధించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం సామాజిక మాధ్యమ దిగ్గజం 'మెటా' సీనియర్ అధికారులను తమ ఎదుట హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాబోయే 7 నుండి 10 రోజుల్లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.

ఈ అంశంపై MeitY కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. ఈ ఘటన ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి సోషల్ మీడియా సంస్థ నుండి విధానపరమైన మరియు సాంకేతిక వివరణలను కోరుతున్నామని తెలిపారు. భారత్ తన ఆందోళనలను నేరుగా మెటాకు తెలియజేస్తుందని, ఈ పరిస్థితులకు దారితీసిన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సేకరిస్తుందని స్పష్టం చేశారు.

"ఈ ఘటనపై మెటా ఇప్పటికే తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రాథమిక వివరణ ఇచ్చింది. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కంపెనీ తీసుకుంటున్న చర్యలతో పాటు మరింత వివరణాత్మకమైన నివేదికను కేంద్రం కోరింది" అని ఎస్. కృష్ణన్ తెలిపారు.

వివాదానికి దారితీసిన పోస్ట్ ఏంటి?

జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతను ఉద్దేశించి, నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీలపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తూ ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్‌పై ఫేస్‌బుక్ తాత్కాలిక ఆంక్షలు విధించడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. సాంకేతిక లోపం వల్లే ఇది జరిగిందని మెటా క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆ వివరణ సరిపోదని, దీనిపై లోతుగా విచారించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.

భవిష్యత్తులో ప్రధాని మరియు ఇతర ప్రముఖ వ్యక్తుల ఖాతాల కంటెంట్ విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జూలై 28 నుంచి ఒక నూతన ప్రోటోకాల్‌ను అమలులోకి తెచ్చినట్లు మెటా కేంద్రానికి తెలిపింది. ముందస్తు పరిమితులు లేదా పొరపాట్లు జరగకుండా అదనపు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story