Karnataka New Rules: ఆసుపత్రులకు బాలిక గర్భవతిగా వస్తే పోలీసులకు చెప్పాల్సిందే

Karnataka New Rules: సమాజంలో బాలల రక్షణ కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు… ఒక ధార్మిక కర్తవ్యముగా కూడా భావించాలి. చిన్నారులపై జరిగే అన్యాయాలను అరికట్టడం, వారి భవిష్యత్తును కాపాడడం ప్రతి మనిషి బాధ్యత.

Balachander
Published on: 3 April 2026 1:19 PM IST
Karnataka New Rules
X

Karnataka New Rules: ఆసుపత్రులకు బాలిక గర్భవతిగా వస్తే పోలీసులకు చెప్పాల్సిందే

Karnataka New Rules: సమాజంలో బాలల రక్షణ కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు… ఒక ధార్మిక కర్తవ్యముగా కూడా భావించాలి. చిన్నారులపై జరిగే అన్యాయాలను అరికట్టడం, వారి భవిష్యత్తును కాపాడడం ప్రతి మనిషి బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించాలనే లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇక నుంచి 18 ఏళ్లలోపు బాలిక గర్భవతిగా ఆసుపత్రికి వస్తే... వెంటనే ఆ విషయాన్ని తప్పనిసరిగా పోలీసులకు తెలియజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రి పాటించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం పోక్సో చట్టం 2012 ప్రకారం తీసుకోబడింది. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు బాలిక గర్భం దాల్చడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. సెక్షన్ 19(1) ప్రకారం, ఎవరైనా ఈ విషయాన్ని గమనించినా, అనుమానం వచ్చినా, వెంటనే పోలీసులకు లేదా ప్రత్యేక జువైనల్ పోలీస్ యూనిట్‌కు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. ఈ నియమాన్ని పాటించకపోతే, సంబంధిత ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యులకు ఏడాది వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముంది.

మార్గదర్శకాలు

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, విడుదల చేసిన మార్గదర్శకాలను కర్ణాటకలోని ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రులు పాటించాలని ఆదేశించింది. ప్రతి కేసును సక్రమంగా నమోదే చేయాలి. అదే సమయంలో బాలిక యొక్క గోప్యతను కాపాడటం కూడా అత్యంత ముఖ్యమని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అవసరమైతే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఇది కేవలం చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాదు… ఒక ప్రాణాన్ని, ఒక భవిష్యత్తును కాపాడే మార్గమని సూచించింది. దీనిపై ఆసుపత్రుల యాజమాన్యం వైద్యులకు, సిబ్బందికి పోక్సో చట్టంపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆదేశాలు అమల్లోకి వచ్చిన తరువాత ప్రతి ఆసుపత్రిపై నిఘా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story