Iran Oil Tankers: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు.. గుజరాత్ తీరానికి చేరిన రెండు భారీ నౌకలు!

Iran Oil Tankers: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు నౌకలు చేరుకున్నాయి.

Arun Chilukuri
Published on: 13 April 2026 11:19 AM IST
Iran Oil Tankers
X

Iran Oil Tankers: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు.. గుజరాత్ తీరానికి చేరిన రెండు భారీ నౌకలు!

Iran Oil Tankers: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ భారత్‌కు ఊరటనిచ్చే వార్త. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఇరాన్ నుంచి ముడి చమురు (Crude Oil) నౌకలు భారత తీరానికి చేరుకున్నాయి. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఇరాన్‌కు చెందిన రెండు భారీ చమురు నౌకలు గుజరాత్‌లోని సిక్కా పోర్టులో లంగరేశాయి.

నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఈ రెండు నౌకలు మార్చి మధ్యలో ఖర్గ్ ద్వీపం నుంచి బయలుదేరి, సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చినట్లు సమాచారం.

2019లో అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేసింది. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన కొరత దృష్ట్యా అమెరికా ఆంక్షలను కొంత మేర సడలించడంతో ఈ రవాణా సాధ్యమైంది.

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో హర్మూజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చమురు చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రపంచంలోనే చమురు దిగుమతి చేసుకునే మూడో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్, తన ఇంధన భద్రత కోసం వివిధ దేశాల నుంచి చమురును సేకరిస్తోంది. ఇరాన్ నుంచి వచ్చిన ఈ నిల్వలను ఏ సంస్థ కొనుగోలు చేసిందనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. యుద్ధ మేఘాల మధ్య ఇంధన ధరలు పెరగకుండా ఉండేందుకు ఈ దిగుమతులు తోడ్పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story