Indian Railways: పొరపాటున లేడీస్ కోచ్లోకి ఎక్కినా కూడా.. ఇక పురుషులకు రూ. 2500 ఫైన్.!
Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. రైళ్లలో మహిళల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Indian Railways: పొరపాటున లేడీస్ కోచ్లోకి ఎక్కినా కూడా.. ఇక పురుషులకు రూ. 2500 ఫైన్.!
Indian Railways: భారతీయ రైల్వే తమ రైళ్లలో ప్రయాణించే మహిళల రక్షణ, భద్రత కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. మహిళలు ఎలాంటి ఆకతాయిల ఇబ్బందులు లేకుండా అత్యంత సురక్షితంగా, ప్రశాంతంగా ప్రయాణించేలా రైల్వే శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన లేడీస్ కోచ్లు లేదా కంపార్ట్మెంట్లలో ఎవరైనా పురుషులు నిబంధనలు అతిక్రమించి ప్రయాణిస్తే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగా హెచ్చరించింది.
నిబంధనలను ఉల్లంఘించి లేడీస్ కోచ్లలో ప్రయాణించే పురుషులపై విధించే ఫైన్ను అమాంతం పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మహిళా కోచ్లో మగవారు ప్రయాణిస్తే పట్టుబడినప్పుడు కేవలం రూ. 500 జరిమానా మాత్రమే విధించేవారు. కానీ ఇప్పుడు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ ఫైన్ను ఏకంగా రూ. 2,500 వరకు పెంచారు.
ప్రయాణికులు గమనించాల్సిన విషయమేమిటంటే.. పెంచిన ఈ కొత్త జరిమానాల రూల్ ఇప్పటికే అధికారికంగా అమలులోకి వచ్చేసింది. ఈ కఠిన నిబంధన దేశవ్యాప్తంగా నడిచే సబ్ అర్బన్ లోకల్స్, ప్యాసింజర్, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లన్నింటికీ కచ్చితంగా వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. కేవలం లేడీస్ కోచ్ ఉల్లంఘనలే కాకుండా, రైళ్లలో ఎవరైనా స్మోకింగ్ చేసినా లేదా తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా న్యూసెన్స్ క్రియేట్ చేసినా కూడా రూ. 2 వేల వరకు భారీ జరిమానా విధిస్తామని రైల్వే శాఖ తీవ్రంగా హెచ్చరించింది.
మహిళల భద్రత పట్ల రైల్వే శాఖ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు మహిళా ప్రయాణికులకు మరింత భరోసాను ఇస్తున్నాయి. కాబట్టి పురుష ప్రయాణికులు రైల్వే నిబంధనలను తప్పక గౌరవించి, తమకు కేటాయించిన కోచ్లలోనే సురక్షితమైన ప్రయాణాన్ని సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.




