Cough Syrup Ban : చిన్నారుల దగ్గు మందులపై కేంద్రం ఉక్కుపాదం.. రెండేళ్ల లోపు పిల్లలకు సిరప్‌లు నిషేధం?

Cough Syrup Ban : చిన్న పిల్లల దగ్గు మందులపై కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. రెండేళ్ల లోపు పిల్లలకు సిరప్‌ల నిషేధంపై ప్రతిపాదన ఇవ్వనుంది. NFI 2026 కొత్త గైడ్‌లైన్స్,హెల్త్ అలెర్ట్స్ గురించి తెలుసుకుందాం.

CR Reddy
Published on: 12 April 2026 10:16 AM IST
Cough Syrup Ban
X

Cough Syrup Ban

Cough Syrup Ban : చిన్నారుల ఆరోగ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు వాడే దగ్గు మందుల విషయంలో నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తోంది. నాసిరకం సిరప్‌ల వల్ల గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ప్రాణహాని కలిగించే రసాయనాల వినియోగానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. చిన్న పిల్లలకు జలుబు, దగ్గు వస్తే వెంటనే సిరప్‌లు వేసే అలవాటుకు ఇక స్వస్తి పలకాల్సిందే. రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందులను ప్రిస్క్రిప్షన్‌లో రాయకుండా పూర్తిగా నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. అదేవిధంగా ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా క్లినికల్ పరీక్షలు చేయకుండా, అత్యంత జాగ్రత్తగా తప్పనిసరి అయితేనే వీటిని సిఫారసు చేయాలని యోచిస్తోంది. ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (IPC) విడుదల చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (NFI) 2026 ముసాయిదాలో ఈ మేరకు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

సిరప్‌లలో ప్రాణాంతక రసాయనాలు

గతేడాది కొన్ని నాసిరకం దగ్గు మందుల కారణంగా విదేశాల్లోనూ, స్వదేశంలోనూ పలువురు చిన్నారులు మరణించిన సంఘటనలు కలకలం రేపాయి. కొన్ని లిక్విడ్ ఓరల్ ఫార్ములేషన్స్‌లో డైఇథిలీన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) వంటి ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఇవి కిడ్నీ దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే, ఇకపై ఫార్మా కంపెనీలు కచ్చితంగా ఫార్మాకోపియల్ గ్రేడ్ సాల్వెంట్లనే వాడాలని, ప్రతి బ్యాచ్‌ను ల్యాబ్‌లో పరీక్షించి రికార్డులు మెయింటైన్ చేయాలని కేంద్రం నిబంధనలు విధిస్తోంది.

నిపుణులు ఏమంటున్నారు?

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దగ్గు అనేది శరీరంలోని శ్వాసనాళాలను శుభ్రం చేయడానికి చేసే ఒక సహజమైన రక్షణ ప్రక్రియ. సిరప్‌ల ద్వారా ఆ దగ్గును అణచివేయడం వల్ల ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పైగా చిన్న పిల్లల్లో ఈ సిరప్‌ల వల్ల కలిగే ప్రయోజనం చాలా తక్కువని, రిస్క్ ఎక్కువని చెబుతున్నారు. సిరప్‌లకు బదులుగా పిల్లలకు ఎక్కువగా ద్రవ పదార్థాలు (హైడ్రేషన్), సెలైన్ డ్రాప్స్ వాడటం మంచిదని సూచిస్తున్నారు. ఏడాది దాటిన పిల్లలకు తేనె ఇవ్వడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.

తల్లిదండ్రుల బాధ్యత

పసిపిల్లలకు దగ్గు వస్తే కంగారు పడి సొంతంగా మెడికల్ షాపులకు వెళ్లి సిరప్‌లు కొనవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. కేవలం డాక్టర్ల సలహా మేరకు, నిబంధనలకు అనుగుణంగా ఉన్న మందులను మాత్రమే వాడాలి. అడ్డగోలుగా సిరప్‌లు వాడటం వల్ల పిల్లల మెదడు, మూత్రపిండాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, చిన్నారుల మరణాలను అరికట్టవచ్చని ఆరోగ్య శాఖ భావిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story