BJP Foundation Day 2026: బీజేపీ ఫౌండేషన్ డే..కార్యకర్తలకు ప్రధాని మోదీ అభినందనలు
BJP Foundation Day 2026: బీజేపీ ఫౌండేషన్ డే వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తో సహా పలువురు నాయకులు తమ సందేశాలను ఇచ్చారు
BJP Foundation Day 2026
BJP Foundation Day 2026: భారతదేశపు అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ, 2026 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు (ఏప్రిల్ 6) తన 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ జెండాతో సెల్ఫీ తీసుకున్నారు. మధ్యప్రదేశ్లో నేడు 17 కొత్త కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రధాని మోదీ X లో చేసిన ఒక పోస్ట్లో కార్యకర్తలను అభినందిస్తూ, "అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి బీజేపీ కట్టుబడి ఉంది. మన సమిష్టి సంకల్పం ఈ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లి, భారతదేశాన్ని ప్రగతి, శ్రేయస్సుల కొత్త శిఖరాలకు చేర్చాలని ఆశిస్తున్నాము" అని పేర్కొన్నారు.
పార్టీ సైద్ధాంతిక మూలాలను, అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ సంస్థగా అది పరిణామం చెందిన తీరును ప్రముఖ నాయకులు కూడా ఈ సందర్భంగా తమ సందేశాలలో వివరించారు .
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా "బీజేపీ ప్రధాన మంత్రం ఎప్పుడూ స్పష్టంగా ఉంది: ముందు దేశం, తరువాత పార్టీ, చివర నేను. ఈ ప్రధాన స్ఫూర్తితో, ప్రతి బీజేపీ కార్యకర్త దేశ సేవకు రేయింబవళ్లు అంకితభావంతో ఉన్నారు." అంటూ తన సందేశాన్ని ఇచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, బీజేపీ ఏర్పాటు కేవలం రాజకీయ పరిణామం మాత్రమే కాదని, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్దయాల్ ఉపాధ్యాయుల స్ఫూర్తితో జాతీయ పునర్నిర్మాణానికి తీసుకున్న ప్రతిజ్ఞ అని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పార్టీ "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" అనే దార్శనికతను ముందుకు తీసుకెళ్లి, ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసిందని ఆయన వెల్లడించారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ వ్యవస్థాపక నాయకులకు, కార్యకర్తలకు నివాళులర్పించారు. వారి కృషి వల్లే పార్టీ జాతీయ రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరుకుందని అన్నారు. 'అంత్యోదయ', సమ్మిళిత అభివృద్ధిపై పార్టీ దృష్టి సారించిందని ఆయన చెప్పారు. అలాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర భారతదేశాన్ని నిర్మించాలన్న తమ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, నితిన్ గడ్కరీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, బీజేపీ ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఎదగడానికి పార్టీ కార్యకర్తల అంకితభావమే కారణమని ప్రశంసించారు.
1980లో ప్రారంభం..
బీజేపీ 1980 ఏప్రిల్ 6న స్థాపించారు. అయితే, దీని పునాదులు 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్దయాల్ ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన భారతీయ జనసంఘ్లో ఉన్నాయి. 1975-77లో ఎమర్జెన్సీ తర్వాత, జనసంఘ్తో సహా పలు పార్టీలు విలీనమై జనతా పార్టీగా ఏర్పడ్డాయి. కానీ విభేదాల కారణంగా 1980లో అవి చీలిపోయాయి. ఇది బీజేపీ ఏర్పాటుకు దారితీసింది.
బీజేపీ ఆవిర్భవించినప్పటి నుండి నరేంద్ర మోదీ, అటల్ బిహారీ వాజ్పేయ్ ఇద్దరు ప్రధానమంత్రులను చూసింది. 1996, 1998, 1999 లోక్సభ ఎన్నికలలో ఈ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2019 లోక్సభ ఎన్నికలలో, ఈ పార్టీ తన చరిత్రలోనే అత్యధికంగా 303 స్థానాలను గెలుచుకుంది.




