Assembly Elections: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో హోరాహోరీ పోరు..మే 4న తేలనున్న ఫలితం
Assembly Elections 2026: దక్షిణాది నుంచి ఈశాన్యం వరకు.. నేడు దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది.
Assembly Elections
Assembly Elections 2026: దక్షిణాది నుంచి ఈశాన్యం వరకు.. నేడు దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
కేరళ
కేరళలో మొత్తం 140 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. గత రెండు సార్లు వరుసగా గెలిచిన ఎల్డీఎఫ్ , ఈసారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తుండగా, బీజేపీ బలమైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది.సుమారు 2.71 కోట్లకు పైగా ఓటర్లు నేడు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
అస్సాం
అస్సాం రాజకీయాల్లో ఈసారి భారీ మార్పు కనిపిస్తోంది. గతంలో విడతల వారీగా జరిగిన ఎన్నికలు, ఈసారి కేవలం ఒకే రోజులో ముగియడం విశేషం. 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అధికార ఎన్డీయే ,విపక్ష ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో తన పట్టును నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
పుదుచ్చేరి
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడ ఉన్న 30 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం తొలిసారిగా ఇక్కడ డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టింది. ఎన్డీయే కూటమికి, కాంగ్రెస్-డీఎంకే కూటమికి మధ్య ఇక్కడ నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది.
మే 4న ఫలితాలు
నేడు ఈ మూడు ప్రాంతాల్లోని ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే అభ్యర్థుల జాతకాలు మే 4న వెలువడనున్నాయి. ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


