Suryapet: వరి వద్దు.. పామాయిల్ ముద్దు సూర్యాపేట కలెక్టర్ తేజస్!
Suryapet: సూర్యాపేట మండలం కాసరాబాద్లో ఆయిల్ పామ్ తోటలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు
Suryapet: వరి వద్దు.. పామాయిల్ ముద్దు సూర్యాపేట కలెక్టర్ తేజస్!
సూర్యాపేట: రైతులు వరి సాగుకు స్వస్తి పలికి లాభసాటి పామాయిల్ తోటల వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. పామాయిల్ తోటలు రైతులకు 35 ఏళ్ల పాటు స్థిర ఆదాయాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.
బుధవారం సూర్యాపేట మండలం కాసరాబాద్లో ఆయిల్ పామ్ పంటలను పరిశీలించిన కలెక్టర్, పామాయిల్ సాగు చేస్తున్న రైతు మల్లేష్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరితో పోలిస్తే పామాయిల్లో పెట్టుబడి భారం తక్కువని తెలిపారు. ఒక్కసారి తోట నాటితే నాలుగో ఏట నుంచి 30 ఏళ్ల వరకు స్థిరమైన, అధిక ఆదాయం లభిస్తుందని వివరించారు.
పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 70% నుంచి 90% వరకు సబ్సిడీ అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. తోట నాటిన మొదటి నాలుగేళ్ల వరకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి రూ.4,200 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
మొదటి మూడేళ్లు మొక్కలు పెరిగేలోపు కోకో, వక్క, మిరియాలు, తమలపాకు వంటి అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. మూడున్నరేళ్ల తర్వాత పామాయిల్ నుంచి ప్రధాన ఆదాయం మొదలవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య, వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, ఉద్యాన అధికారి కట్ట స్వాతి, ఆయిల్ ఫెడ్ కో ఆర్డినేటర్ నిమ్మ గోపికృష్ణతో పాటు పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు.




