Suryapet: నీట్ లీకేజీపై ఢిల్లీ లాఠీచార్జ్కు నిరసన మోదీ దిష్టిబొమ్మ దగ్ధం!
Suryapet: ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు లాఠీచార్జ్ను ఖండిస్తూ సూర్యాపేటలో న్యూడెమోక్రసీ నిరసన. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్.
Suryapet: నీట్ లీకేజీపై ఢిల్లీ లాఠీచార్జ్కు నిరసన మోదీ దిష్టిబొమ్మ దగ్ధం!
Suryapet: నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువత, ప్రజాసంఘాల నేతలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
జులై 20న ఢిల్లీ పార్లమెంటు సరిహద్దుల్లో జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని అన్నారు. ఆ హక్కును అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి రక్తం కారేలా లాఠీచార్జి చేయడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విద్యా వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
పర్యావరణ పరిరక్షణ, ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సోనం వాంగ్చుక్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని కూడా ఆయన ఖండించారు. భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి అరెస్టులను ఆయుధంగా వాడటం సరికాదని, సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల గొంతును అణచివేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కాక్రోచ్ పార్టీ, విద్యార్థులు, యువత, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు అనురాధ, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయగిరి, ఐఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కునుకుంట్ల సైదులు, పివైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్యతో పాటు పలువురు జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




