Suryapet: సూర్యాపేటలో పోలీసుల భారీ కార్డన్ అండ్ సెర్చ్
Suryapet: సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Suryapet: సూర్యాపేటలో పోలీసుల భారీ కార్డన్ అండ్ సెర్చ్
Suryapet: సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 65 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. గతంలో నేరాలకు పాల్పడిన నలుగురు అనుమానితులను కూడా గుర్తించారు.
సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, పట్టణ ఎస్ఐల పర్యవేక్షణలో 80 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన నేరస్తులు ఎవరైనా ఆశ్రయం పొందారా, దొంగతనం వాహనాలు ఉన్నాయా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే అంశాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, అనుమానిత వ్యక్తుల కదలికల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నివారణ కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇది ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిందని చెప్పారు.
కాలనీలోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నవారికి ఇళ్లు అద్దెకు ఇవ్వవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని కోరారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువతను పట్టిపీడిస్తున్నాయని, ఇలాంటివి కాలనీలోకి రానివ్వొద్దని డీఎస్పీ అన్నారు. గంజాయి సేవించేవారు, సరఫరా చేసేవారి వివరాలు తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయికి అలవాటు పడిన వారి పునరావాసం కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.
ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీ చేయగా గతంలో నేరాలకు పాల్పడిన నలుగురిని గుర్తించామని, వారి ప్రస్తుత కార్యకలాపాలపై విచారణ జరుగుతోందని డీఎస్పీ వెల్లడించారు.
పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ, ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. రోడ్డు ప్రయాణంలో ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఏడుకొండలు, మహేందర్ నాథ్, శివతేజ, ఐలయ్య, బాలు నాయక్, సైదిరెడ్డి, కనకరత్నం, వెంకన్న, ఏఎస్ఐలు నరేందర్ రెడ్డి, ముత్తయ్య, వెంకన్నతో పాటు స్పెషల్ పార్టీ, పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




