Suryapet: సూర్యాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Suryapet: సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం సేకరణపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మిక తనిఖీలు. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లకు హెచ్చరిక.
Suryapet: సూర్యాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
సూర్యాపేట: జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన చివ్వెంల మండలం బిబి గూడెం శివ దుర్గ రైస్ మిల్, తిరుమలగిరి మండలం ఇటూరులోని సోమేశ్వర రైస్ మిల్ ఇండస్ట్రీ, వ్యవసాయ మార్కెట్, పారా రైస్ మిల్, తాటిపాముల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు.
మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయాలని, మిల్లర్లు దిగుమతిలో జాప్యం చేయవద్దని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. "తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో డీఎస్ఓ మోహన్ బాబు, డీఎం సివిల్ సప్లై శ్రీధర్ రెడ్డి, చివ్వెంల తహసిల్దార్ చంద్రశేఖర్, తిరుమలగిరి తహసిల్దార్ హరిప్రసాద్, రైస్ మిల్లర్లు, యజమానులు పాల్గొన్నారు.




