Suryapet: బస్టాండ్ వద్ద మహిళా హత్య.. దర్యాప్తు స్పీడ్ పెంచిన పోలీసులు!
Suryapet: కోదాడ పట్టణంలో మహిళా హత్య జరిగిన ప్రాంతాన్ని సూర్యాపేట ఎస్పీ నరసింహ ఐపీఎస్ సందర్శించారు.
Suryapet: బస్టాండ్ వద్ద మహిళా హత్య.. దర్యాప్తు స్పీడ్ పెంచిన పోలీసులు!
సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా జరిగిన మహిళ హత్య ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సీరియస్గా స్పందించారు. బుధవారం ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కోదాడ ఇన్స్పెక్టర్ శివశంకర్, ఇతర పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రాంతంలోని దుకాణదారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఎస్పీ, కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, రిమాండ్కు తరలించాలని సూచించారు. సాక్షులను, బాధిత కుటుంబాన్ని విచారించి పక్కా సాక్ష్యాలతో నేరాభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేసి జైలు శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. క్షణికావేశంతో తప్పులు చేసి, వివాదాలకు దిగి నేరాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాలు బలోపేతం అయ్యాయని, సాంకేతికత సాయంతో కేసుల్లో వేగంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్సై సుధీర్ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.




