Suryapet: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు!
Suryapet: సూర్యాపేట జిల్లా తూర్పుగూడెం గ్రామంలో సంచలనం సృష్టించిన అత్త కొణతం భాగ్యమ్మ హత్య కేసును తుంగతుర్తి పోలీసులు ఛేదించారు.
Suryapet: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు!
సూర్యాపేట: తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో జరిగిన కొణతం భాగ్యమ్మ హత్య కేసును తుంగతుర్తి పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాల కారణంగా అత్తను హత్య చేసిన కోడలు కొణతం మధురను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ కేసు వివరాలను సూర్యాపేట పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. ఆయన వెంట తుంగతుర్తి సర్కిల్ సిఐ బి. ఉపేందర్ రావు ఉన్నారు.
తూర్పుగూడెం గ్రామంలో కొణతం భాగ్యమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినది. మృతురాలి కుమార్తె ఉప్పు శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుంగతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
విచారణలో మృతురాలి కోడలు కొణతం మధురే హత్య చేసినట్లు తేలింది. భాగ్యమ్మకు తూర్పుగూడెంలో సుమారు 6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో తనకు వాటా కావాలని కుమార్తె శోభారాణి తుంగతుర్తి కోర్టులో కేసు దాఖలు చేసింది. దీంతో అత్తా, కోడళ్ల మధ్య గొడవలు నడుస్తున్నాయి.
ఏప్రెల్ 26న శోభారాణి తల్లి వద్దకు వచ్చి భూమి వాటా గురించి అడిగి వెళ్లింది. మరుసటి రోజు రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉన్న మధురతో భాగ్యమ్మ ఈ విషయం చెప్పింది. కనీసం 2 ఎకరాలు ఇవ్వాలని కోరింది. దీంతో ఆగ్రహించిన మధుర భూమిని దక్కించుకునేందుకు అత్తను చంపాలని నిర్ణయించుకుంది. మొదట భాగ్యమ్మను గట్టిగా నెట్టగా కింద పడింది. మళ్లీ లేవగా, వెనుక నుండి చేతులతో మెలివేసి మంచంపైకి నెట్టింది.
కొద్దిసేపటికి భాగ్యమ్మ అక్కడే మరణించింది. ఆ తర్వాత సహజ మరణంగా చిత్రీకరించేందుకు మధుర బంధువులకు ఫోన్ చేసి, భాగ్యమ్మ మంచం నుండి కిందపడి చనిపోయిందని చెప్పింది. అంత్యక్రియల సమయంలో స్నానం చేయిస్తుండగా మృతురాలి శరీరంపై గాయాలు గమనించిన కుమార్తె శోభారాణి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.




