Nalgonda: మాదక ద్రవ్య రహిత సమాజం కోసం కలెక్టర్ పిలుపు!
Nalgonda: నల్గొండ ఎన్జీ కళాశాలలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Nalgonda: మాదక ద్రవ్య రహిత సమాజం కోసం కలెక్టర్ పిలుపు!
నల్గొండ: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలోని ఎన్జీ ప్రభుత్వ కళాశాలలో సంక్షేమ, పోలీస్, ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన "10 కోట్ల మాదక ద్రవ్య రహిత ప్రతిజ్ఞ" మెగా ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి యువత సామాజిక మాధ్యమాలు, డిజిటల్ వ్యసనాలతో పాటు డ్రగ్స్, మద్యం, పొగతాగడానికి బానిసలుగా మారుతుండటం ఆందోళనకరమన్నారు. ఒకప్పుడు ధనికులకే పరిమితమైన డ్రగ్స్, నేడు అందరికీ అందుబాటులోకి రావడం సమాజానికి తీవ్ర ముప్పుగా పరిణమించిందన్నారు. మత్తు పదార్థాల వల్ల వ్యక్తిగత జీవనంతో పాటు కుటుంబాలు, సమాజం నాశనమవుతాయని హెచ్చరించారు.




